నిధులకు ఇబ్బందేం లేదు.. పోలవరం వేగం పెంచండి: కేంద్రం

నిధులకు ఇబ్బందేం లేదు.. పోలవరం వేగం పెంచండి: కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కీలక ప్రకటన చేశారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించి, ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యపై దృష్టి పెడితే పనులు వేగంగా జరుగుతాయని ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తగా కేంద్రం తరపున షెకావత్ స్పందించారు.

ఈ సమయంలోనే సవరించిన అంచనాలను ఎప్పుడు ఆమోదిస్తారో చెప్పాలని కేంద్ర జలశక్తిమంత్రిని అడిగారు విజయసాయి రెడ్డి. జాతీయ ప్రాజెక్టైన పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2500 కోట్ల సొంత నిధులను ఖర్చు చేసినట్లుగా ఈ సంధర్భంగా విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.47వేల 725కోట్ల వ్యయం అవుతుందని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ అంచనా వేసినట్లు మార్చి 2020లో లోక్‌సభలో మంత్రి ప్రకటించారని ఎంపీ సాయిరెడ్డి గుర్తుచేశారు.

కానీ సాంకేతిక నిపుణుల కమిటీ 2017- 18 ధరల ప్రకారం రూ.55 వేల 656 కోట్లు ఖర్చు అవుతుందని మరోసారి అంచనా వేసినట్లు వెల్లడించారు పార్లమెంట్ సభ్యులు సాయి రెడ్డి. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర షేకావత్‌ 2013-14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ధరలు పెంచేందుకు అవకాశం లేదని విభజన చట్టంలో పేర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.

పెరిగిన ధరలపై నిపుణుల కమిటీ ఇచ్చిన సవరించిన అంచనాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రాజెక్టు నిర్మాణానికి రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కోరగా.. పొలవరం నిర్మాణానికి ఎటువంటి నిధులు సమస్య లేదని, నాబార్డ్‌ నిధులను అందజేస్తామని షెకావత్ చెప్పారు. పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను సమర్పించాలని, వాటి పరిశీలన తర్వాత నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి మరోసారి స్పష్టం చేశారు.