Chiranjeevi Charitable Trust: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఆక్సిజన్ బ్యాంకులు!
కరోనా సెకండ్ వేవ్ తో సమాజానికి ఆక్సిజన్ విలువ ఏంటో తెలిసొచ్చింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతో సోనూసూద్ నుండి ఎందరో ప్రముఖులు దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ముందుకొచ్చారు.
Chiranjeevi Charitable Trust: కరోనా సెకండ్ వేవ్ తో సమాజానికి ఆక్సిజన్ విలువ ఏంటో తెలిసొచ్చింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతో సోనూసూద్ నుండి ఎందరో ప్రముఖులు దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ముందుకొచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా దశాబ్దాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్ర, రక్తదానంలో విస్తృత సేవలు అందిస్తున్న చిరంజీవి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం మొదలుపెట్టారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామని గత వారం మెగాస్టార్ చిరంజీవి ప్రకటించినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటవగా మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. మరికొన్ని జిల్లాలకు బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ సన్ ట్రేటర్లు పంపించారు.
ఏపీ, తెలంగాణలోని ప్రతి జిల్లాల్లో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు. అవసరాన్ని బట్టి ఈ పంపిణీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉండనుండగా.. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది.
ఇక్కడ స్కార్సిటీ వల్ల చైనా నుంచి ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లు ఆర్డర్ చేశాం. ప్రస్తుతం చాలా చోట్ల వీటి కొరత నెలకొంది. అత్యవసరంగా ఎక్కడ అవసరం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాలకు అవసరం ఉన్న అన్నిచోట్లకు పంపిణీ చేస్తాం. అలాగే ప్రతిచోటా ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది ట్రాకింగ్ పరికరాన్ని కూడా టెక్నీషియన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది సద్వినియోగం కావాలనే మా ప్రయత్నం. రామ్ చరణ్ దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారని చెప్పారు.