కరోనా టైం : గొంతు నొప్పి..గరగరా ఉందా..హోం రెమిడీస్
ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు పాలకులు చర్యలు చేపడుతున్నారు. కానీ నేను మాత్రం అందరికీ అంటుకుంటానంటూ..విస్తరిస్తూనే ఉంది ఈ రాకాసి. కానీ..వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
అందులో ప్రధానమైంది వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తదితర వాటిని పాటించాలంటున్నారు. అంతేగాకుండా..పౌష్టికాహారం తీసుకోవాలంటున్నారు. జలుబు చేయడం, చలితో వణుకు, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, నాలుక రుచిని కోల్పోవడం, ముక్కు వాసన పసిగట్టలేకపోవడం కూడా కరోనా లక్షణాలని వెల్లడిస్తున్నారు.
ఈ లక్షణాలుంటే..రెండు నుంచి పద్నాలుగు రోజుల్లోపల కరోనా పాజిటివ్ తేలే అవకాశాలున్నాయని సీడీసీ (వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం) వెల్లడించింది. ప్రస్తుతం వాతావరణం మారిపోయింది. వర్షకాలం వచ్చేసింది. పైగా కరోనా వైరస్ ఉంది. దీంతో వ్యాధి మరింత విజృంభించే అవకాశం ఉందంటున్నారు. జలుబు, దగ్గుతో పాటు..గొంతు నొప్పి వస్తుంటుంది.
కరోనా వైరస్ లక్షణాల్లో ఇది కూడా ఒకటి. గొంతు నొప్పితో పాటు..దురద, గొంతు, మెడ చుట్టూ..వాపు వంటి లక్షణాలు ఉంటే..జాగ్రత్త పడాలంటున్నారు వైద్యులు. అతి సులభంగా దీని నుంచి బయటపడాలంటే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వెల్లడిస్తున్నారు.
చాయిలో అల్లం చేర్చితే గొంతులో దురద, నొప్పి నయం అయ్యే అవకాశం ఉంది. గోరు వెచ్చని నీటిని తాగాలి. ఒక టేబుల్ స్పూన్ గళ్ల ఉప్పు లేదా వంట సోడాను గోరు వెచ్చని నీటిలో వేసి కలియబెట్టాలి. ఈ నీటిని పుక్కిలించాలి.
వేడి నేటిలో నిమ్మరసం, తేనే కలిపి తాగాలి. గొంతు నొప్పి తగ్గించడంలో వెల్లుల్లి మంచి మేలు చేస్తుంది. ఇది బ్యాక్టరియాతో పోరాడుతుంది. క్రిములను నాశనం చేస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. వెల్లుల్లి రెబ్బను తీసుకుని…నమిలి మింగడం వల్ల…గొంతు నొప్పి తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు.