హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న RTC బస్సులు..! Metro కూడా
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నా… హైదరాబాద్లో బస్సులు నడవకపోవడంతో రాజధాని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కారణంగా 78 రోజుల నుంచి డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు మళ్లీ ఎప్పుడు రోడ్డెక్కుతాయా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమావేశమైన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్… ఈ నెల 8 నుంచి హైదరాబాద్లో సిటీ బస్సులు నడిపే అంశంపై చర్చించినట్టు సమాచారం. ఒకవేళ నగరంలో మళ్లీ బస్సు సర్వీసులు మొదలుపెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై మంత్రి అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్లో మెట్రో రైళ్లను కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు మెట్రో అధికారులు. మళ్లీ పరుగులు పెట్టేందుకు మెట్రో రైళ్లు సిద్ధమవుతున్నాయి. లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన రైళ్లను పట్టాలెక్కించేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విమానాలు, రైళ్లు ప్రారంభమవడంతో… ఇక మెట్రో రైళ్లను కూడా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈనెల మూడో వారాన్ని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే… దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. మరి ఆర్టీసీ బస్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయో చూడాలి మరి.
కానీ హైదరాబాద్ లో మాత్రం కరోనా కేసులు అధికమౌతూనే ఉన్నాయి. అత్యధికంగా ఇక్కడ 2 వేల 035 కేసులు నమోదు కావడం గమనార్హం. మొన్నటి వరకు జియాగూడ, ఆసిఫాబాద్, భోలక్ పూర్, కార్వాన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా నాగోల్ డివిజన్ లోని బండ్లగూడ, ఫతుల్లాగూడలో కరోనా కేసులు నమోదు కావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. నారాయణగూడ, రామంతాపూర్ ల్యాబ్ టెక్నీషీయన్లకు కరోనా సోకింది. దమ్మాయిగూడలో 8 నెలల చిన్నారికి వైరస్ వ్యాపించగా, గోల్నాకాలో ఓ మహిళ కరోనాతో మృతి చెందింది.
Read: హైదరాబాద్పై కరోనా పంజా : నారాయణగూడ, రామంతాపూర్ లో కేసులు..8 నెలల చిన్నారికి కూడా