48 గంటలు..ఇంట్లోనే కరోనా రోగి డెడ్ బాడీ, కుటంబసభ్యుల తీవ్ర ఆవేదన
కరోనా వ్యాధితో చనిపోయిన ఓ వ్యక్తి డెడ్ బాడీతో కుటుంబసభ్యులు గడిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చనిపోయారని, అంత్యక్రియల కోసం ఏర్పాటు చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ కోరినా అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో ఆ డెడ్ బాడీ ఏకంగా 48 గంటల పాటు ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది.
భారతదేశంలో కరోనా ఎలా విస్తరిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వ్యాధితో చనిపోయిన వారి విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రోగి మరణిస్తే..డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు నిబంధనలు అనుమతించవు. అంత్యక్రియలు కూడా నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. వీరి విషయంలో అధికారులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
సెంట్రల్ కోల్ కతా రాజా రామ్మోహన్ రాయ్ కాలనీకి చెందిన ఓ 71 సంవత్సరాలున్న వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో ప్రైవేటు ల్యాబ్ లో శాంపిల్స్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు. కానీ..అతని ఆరోగ్య పరిస్థితి విషమించి..ఇంట్లోనే చనిపోయారు. కానీ..కోవిడ్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనే రిపోర్టు రాలేదు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి స్థానిక ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు.
ఇదే విషయాన్ని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, స్థానిక పోలీసులు, ఇతరులకు తెలియచేసి సాయం చేయాల్సిందిగా కుటుంబసభ్యులు కోరారు. అంత్యక్రియల కోసం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ వైద్యాధికారులకు తెలియచేశారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తామే అంత్యక్రియలు నిర్వహించాలని భావించినా…డెత్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఖననం చేసేందుకు పలువురు నిరాకరించారు. ఎంత ప్రయత్నించినా..ఫలితం లేకపోవడంతో కుటంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఓ ప్రీజర్ ను తీసుకొచ్చి…ఇంట్లోనే డెడ్ బాడీని ఉంచారు.
సుమారు 48 గంటల అనంతరం వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిన విషయాన్ని అధికారులకు తెలియచేశారు. ఇదంతా మీడియాలో ప్రచారం కావడంతో…2020, జులై 01వ తేదీ బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అధికారుల తీరును పలువురు తప్పుబడుతున్నారు.
Read:కరోనాతో మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాలకు అంగీకరించని గ్రామస్తులు