Covid India: దేశవ్యాప్తంగా చెలరేగుతున్న కరోనా..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఇండియాలో మాత్రం చాపకింద నీరులా చెలరేగిపోతున్నా..
Covid India: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఇండియాలో మాత్రం చాపకింద నీరులా చెలరేగిపోతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలను ముమ్మరం చేసేశాయి. హాస్పిటల్స్ లో బెడ్స్ అవైలబిలిటీ, ఆక్సిజన్ సప్లై, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాయి.
ఢిల్లీ ప్రభుత్వం 6 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించగా…రాజస్థాన్ సర్కారు 15 రోజులు ప్రజలే సెల్ఫ్ రూల్స్ తో కొవిడ్పై పోరుకు సహకరించాలని పిలుపునిచ్చింది. కేరళ కూడా రాత్రిపూట కర్ఫ్యూను మంగళవారం నుంచి అమలు చేయనుంది. ఉత్తర్ప్రదేశ్లోని 5 నగరాల్లో లాక్డౌన్ అమలు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. మరోవైపున దేశంలో మొత్తం కరోనా కేసులు కోటిన్నర దాటాయి.
ఈ మహమ్మారి ప్రస్థానం 445 రోజుల్లో.. రోజుకు సగటున 33వేల 847 చొప్పున మొత్తం కోటి 50లక్షల 61వేల 919 కేసులకు చేరింది. కేసుల సంఖ్య తొలి 25 లక్షలకు చేరుకోవడానికి 198 రోజులు పట్టగా చివరి 25 లక్షలు 15 రోజుల్లోనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన ప్రకారం సోమవారం ఉదయం 8గంటలతో ముగిసిన గత 24 గంటల్లో కొత్తగా 2లక్షల 73వేల 810 మందికి వైరస్ సోకింది.
1619 మంది మృత్యువాత పడ్డారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్(88)కు కొవిడ్ వైరస్ సోకిందని నిర్ధరణ అయ్యింది. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఎయిమ్స్లో చేరారు.
ఢిల్లీ విలవిల
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. ఒక్కరోజులోనే 25వేల మందికి పైగా మహమ్మారి సంక్రమించింది. వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ విధించక తప్పడంలేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ విధిస్తున్నామని తెలిపారు.
రాజస్థాన్లో రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతి అత్యంత ప్రమాదకరంగా ఉందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు.
పంజాబ్లో రాత్రి కర్ఫ్యూను మరో గంట పాటు పొడిగించడంతో పాటు బార్లు, మాల్స్, సినిమా థియేటర్లు, కోచింగ్ సెంటర్లు, వ్యాయామ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలను ఈ నెల 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
యూపీలో అయిదు నగరాల్లో లఖ్నవూ, ప్రయాగ్రాజ్(అలహాబాద్), వారణాసి, కాన్పుర్, గోరఖ్పుర్లలో ఏప్రిల్ 26 వరకు లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
మధ్యప్రదేశ్లో అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఔషధాన్ని, కొవిడ్పై పోరుకు అవసరమైన ఇతర వనరులను సమకూర్చుతామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
బెంగాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించటానికి సీఎం మమత సుముఖత వ్యక్తం చేయలేదు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడం, ఔషధాల సరఫరా, ఆక్సిజన్ అందుబాటులో ఉంచడం, టీకాల సక్రమ నిర్వహణకు అధికారులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.