cpi narayana: జగన్ వల్ల తెలంగాణ లాభపడింది: ‘సీపీఐ’ నారాయణ
cpi narayana: కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ సర్కారుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… మోదీకి, తెలంగాణకు జగన్ సహకరిస్తున్నారని ఆరోపించారు. మోదీకి జగన్ ముద్దుల కృష్ణుడిలాంటి వారంటూ చురకలంటించారు. ఫెడరల్ స్ఫూర్తిని ఎన్టీ రామారావు పెంచితే, తెలుగు జాతి గౌరవాన్ని మోదీ మోకాళ్ళ వద్ద జగన్ తాకట్టు పెడుతున్నారని ఆయన అన్నారు. విశ్వ విద్యాలయాలను మొత్తం వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని చెప్పారు. దావోస్కు ఇక్కడి నుంచి బ్యాచ్కు తీసుకుని వెళ్లి జగన్ ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలో మోదీ పాలనలో 18 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం తెల్లధనంగా మారిందని ఆయన అన్నారు. గుజరాత్లోని ముంద్ర పోర్టు కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరుగుతోందని ఆరోపించారు. విజయవాడ వ్యాపారిని బెదిరించి ముంద్రా పోర్టును ఆదానీకి కట్టబెట్టారని చెప్పారు. సముద్ర తీర ప్రాంత మొత్తాన్ని ఆదానీ పరం చేస్తున్నారని చెప్పారు. ఆదానీ ఇప్పుడు అంబానీని మించిపోయారని ఆయన అన్నారు. మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బొగ్గు ఉత్పత్తి పెరగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన చెప్పారు. ఆదానీకి ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గు గనుల నుంచి భారత్లో బొగ్గును కొనుగోలు చేయడానికి స్కెచ్ వేశారని అన్నారు. అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలంటే దేశంలో ఉత్పత్తి ఆపాలని, అందుకే ఆ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తుందని అన్నారు. అంతర్జాతీయంగా ముడి సరుకులు ధరలు తగ్గినా దేశంలో పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. మోదీ విడాకులు ఇవ్వకుండానే భార్యను వదిలేశారని, భార్య, బిడ్డలు లేని మోదీ దోచుకున్న దాన్ని ఎవరికి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దేశంలో గతంలో 14 మంది ప్రధాన మంత్రులు కలిసి రూ.40 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఒక్కడే రూ.80 లక్షల కోట్లు అప్పు చేశారని నారాయణ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిన వారిలో నెహ్రూ మొదటి వారని, వాటిని అమ్మిన వారిలో మోదీ ఫస్ట్ అని అన్నారు. కాగా, ఈ నెల 25న తమ పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరుగుతుందని, అక్టోబర్లో జాతీయ సమావేశాలు జరుగుతాయని ఆయన అన్నారు.