Cyclone Yaas : దూసుకొస్తున్న పెనుగండం.. నేడు తుపానుగా మారనున్న వాయుగుండం..

మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్‌’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.

Cyclone Yaas : దూసుకొస్తున్న పెనుగండం.. నేడు తుపానుగా మారనున్న వాయుగుండం..

Cyclone Yaas

Cyclone Yaas : మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్‌’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం(మే 24,2021) మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు.

ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి ‘యాస్‌’ అనే పేరును ఒమన్‌ దేశం సూచించింది. అక్కడి భాషలో దీనికి మల్లె పువ్వు అని అర్థం. వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి.

క్రమంగా పెరగనున్న గాలుల తీవ్రత:
సోమవారానికి మధ్య బంగాళాఖాతంలో గంటకు 65 – 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 26 మధ్యాహ్నం నుంచి తుపాను తీరం దాటేదాకా గంటకు 90-110 కి.మీ వేగంతో, తీరం దాటేటప్పుడు 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఆయా తేదీల్లో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా, అసాధారణంగా మారుతుందని తెలిపారు. సోమవారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అలలు 1-2 మీటర్ల వరకూ ఎగసిపడతాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

ప్రధాని సమీక్ష:
‘యాస్‌’ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, తీర ప్రాంతాల్లో ముప్పున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌-19 సోకి చికిత్స పొందుతున్న వారికి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.

తుపాను హెచ్చరికలతో రైళ్లు రద్దు:
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే మీదుగా ఇతర రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. ఈ రైళ్లను ఒక్కో రోజు పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. రద్దయిన తేదీలు 24-30 మధ్య ఉన్నాయి.

ఈ నెల 24న హజ్రత్‌ నిజాముద్దీన్‌-సంత్రగచ్చి(02767), హౌరా-యశ్వంతపూర్‌ (02863), హౌరా-వాస్కోడిగామా(08047), 26న సంత్రగచ్చి-హజ్రత్‌ నిజాముద్దీన్‌(02768), 27న తిరువనంతపురం-షాలిమార్‌ (02641), హౌరా-తిరుచునాపల్లి(02663), చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చి(02808), వాస్కోడిగామా-హౌరా(08048), 27, 28 తేదీల్లో పాట్నా-యర్నాకులం(02644), 28న పురులియా-విల్లిపురం(06169), హౌరా-మైసూరు(08117), 29న కన్యాకుమారి-హౌరా(02666), తాంబ్రం-జసిదిహ్‌(02375), యశ్వంతపూర్‌-హౌరా(06597), హౌరా-యర్నాకులం(02877), 30న హౌరా-పుదుచ్చేరి(02867) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.