చైనాపై యుద్ధం ప్రకటించిన డిఫెన్స్ కాలనీ..ఎలా అంటే
లడక్ లోని గల్వాన్ లోయలో భారత జవాన్లపై చైనా సైనికులు జరిపిన దాడులపై యావత్ దేశం గర్హిస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు చైనాను దోషిగా నిలబెట్టాలనే డిమాండ్స్ వినిపస్తున్నాయి. అంతేగాకుండా…చైనా తయారు చేస్తున్న వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.
చైనా – భారత సైనికుల మధ్య జరిగిన భీకర దాడిలో 20 మంది ఇండియన్ సోల్జర్స్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ దేశంలో నిరసనలు పెల్లుబికాయి. ఆ దేశం తయారు చేసిన ఉత్పత్తులను కాల్చి పారేశారు. చైనా జెండాను, ప్రెసిడెంట్ జిన్ పింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
ఢిల్లీలోని RWA (రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్) డిఫెన్స్ కాలనీ చైనాపై యుద్ధం ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షుడు రిటైర్డ్ మేజర్ రంజిత్ సింగ్ ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఆన్ లైన్ లో ఈ ఆడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. భారత సైనికుల హత్యపై తీవ్రంగా విరుచుకపడ్డారు.
చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరాయుధులైన భారత సైనికులు, అధికారులను అతిదారుణంగా చైనా సైనికులు చంపేశారని..ఇది ద్రోహం..హత్య తప్ప మరేమి కాదన్నారు. ఇందుకు డిఫెన్స్ కాలనీ చైనాపై యుద్ధం ప్రకటిస్తుందని, కానీ మన చేతుల్లోకి తుపాకులను తీసుకోలేమన్నారు.
కానీ ఇతర మార్గాల ద్వారా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారాయన. ఆర్థికపరంగా చైనాను దెబ్బకొట్టగలమని, అన్నీ చైనా వస్తువులను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేశారు.
ప్రధాన నరేంద్ర మోడీ నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. బీహార్ లోని పాట్నా, గుజరాత్ లోని వడోదర, సూరత్ లలో కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. అధ్యక్షుడు జిన్ పింగ్, చైనా జెండాలను తగులబెట్టారు. కొంతమంది నిరసన కారులు చైనా తయారు చేసిన టీవీలు, ఇతర వస్తువులను పగులగొట్టారు. పాక్ పై ఎలాంటి సర్జికల్ ట్రయల్స్ చేశారో అదే విధంగా చైనాలో చేయాలని ఓ నిరసన కారుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read: భారత్లో చైనీస్ ఉత్పత్తుల జాబితా.. సెర్చ్ చేస్తున్న ఇండియన్స్