Gangula Kamalakar : ఆ కేసులో మంత్రి గంగులకు సీబీఐ షాక్.. విచారణకు రావాలని నోటీసులు
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తమ ముందు విచారణకు హాజరు కావాలంది. దీంతో రేపు ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు మంత్రి గంగుల కమలాకర్.

Gangula Kamalakar : తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తమ ముందు విచారణకు హాజరు కావాలంది. దీంతో రేపు ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు మంత్రి గంగుల కమలాకర్. ఆయనతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా విచారణకు హాజరు కానున్నారు.
నకిలీ సీబీఐ అధికారి అరెస్ట్ వ్యవహారంలో మంత్రి, ఎంపీకి నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు. ఇటీవల అరెస్ట్ అయిన నకిలీ అధికారి శ్రీనివాస్ తో మంత్రి గంగుల కమలాకర్ టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు తెలంగాణలో పలువురు మంత్రులు, నాయకులతోనూ తనకు పరిచయం ఉన్నట్లు శ్రీనివాస్ ప్రచారం చేసుకున్నాడు.
ఇక ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ గ్రానైట్ వ్యాపారంపై ఈడీ దర్యాఫ్తు జరిపింది. ఈ కేసుల నుంచి ఉపశమనం కోసం నిందితుడు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సీబీఐ చెబుతోంది. దీంతో ఈ కేసులో వివరణ ఇవ్వాలని మంత్రి గంగుల కమలాకర్ కు నోటీసులు పంపింది సీబీఐ.
మంత్రి గంగలు ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారి పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ దర్యాఫ్తు చేపట్టింది. ఇటీవల కాపు సమ్మేళనంలో నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్.. మంత్రి గంగుల కమలాకర్ తో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో విచారణకు రావాలని మంత్రికి నోటీసులు ఇచ్చింది సీబీఐ. మంత్రి గంగుల, శ్రీనివాస్ కు మధ్య సంబంధాలపై అధికారులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది.
ఇటీవల.. తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. కరీంనగర్లోని మంత్రి గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించడం హాట్ టాపిక్ అయ్యింది. గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఐటీ, ఈడీ అధికారులు ఈ సోదాలు చేశారు.