కరోనా నుంచి కోలుకోకముందే.. భయపెడుతున్న కొత్త రకం వ్యాధి

కరోనా నుంచి కోలుకోకముందే.. భయపెడుతున్న కొత్త రకం వ్యాధి

Flesh-eating Buruli ulcer cases: యావత్ ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూనే ఉంది. వ్యాక్సిన్ వచ్చినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు బయటపడుతున్నాయి. ప్రజలను వణికిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో మరో కలకలం రేగింది. కరోనా చాలదన్నట్టు.. ఆ దేశంలో ఇంకో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వ్యాధి అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

 

పొస్సమ్ అనే జీవి నుంచి వ్యాప్తి.. తీవ్రమైన పండ్లు:
ఆస్ట్రేలియాలో బురులి అల్సర్(Buruli Ulcer) అనే వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పొస్సమ్(possum) అనే జీవుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. మాంసాన్ని తినే ఈ వ్యాధి పొస్సమ్ జీవి నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆ జీవి మలంలో ఉండే బురులి బాక్టీరియా బురులి అల్సర్‌ను వ్యాపింపజేస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన పుండ్లు అవుతాయి. వెంటనే స్పందించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధి సోకిన భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ప్రస్తుతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడం నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది.

 

క్రమంగా పెరుగుతున్న కేసులు:
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఇటీవలి కాలంలో బురులి అల్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 2014లో 65 కేసులు నమోదవగా, 2019లో 299 మందికి ఈ వ్యాధి సోకింది. 2020 లో 218 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడితే బాక్టీరియా చర్మాన్ని చాలా వేగంగా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ముందుగానే గుర్తించి యాంటీ బయోటిక్స్‌తో చికిత్సను అందించాల్సి ఉంటుంది.

 

నిర్లక్ష్యం చేస్తే ఆయా భాగాలను తొలగించాల్సిందే:
ఇక ఈ వ్యాధి కాళ్లు, చేతులు వంటి భాగాలకు సోకితే.. నిర్లక్ష్యం చేస్తే ఆయా భాగాలను తొలగించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి శక్తివంతమైన యాంటీ బయోటిక్స్‌ను ఇస్తారు. ఈ క్రమంలో చికిత్స పూర్తయ్యేందుకు కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు సమయం పడుతుంది. బాక్టీరియా ఇన్ఫెక్షన్లతో వచ్చే టీబీ, కుష్టు, ప్లేగ్ వంటి వ్యాధులకు ఇచ్చే మెడిసిన్‌ను ఈ వ్యాధికి ఇస్తారు.

అయితే దోమల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి రుజువులు లేవని, కానీ పొస్సమ్ అనే జీవి మలం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని మాత్రం నిర్దారించారు. ఈ క్రమంలో ఈ వ్యాధిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు తెలిపారు.

తీరప్రాంతాల్లో ఈ వ్యాధి రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. సెలవు రోజుల్లో ఎంజాయ్ చేసేందుకు ఎక్కువగా జనాలు తీరప్రాంతాలకు వస్తుంటారు. అలాంటి వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం లేదని నిపుణులు తెలిపారు.