కాసేపట్లో గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్…తొలి రౌండ్‌లోనే మెహదీపట్నం రిజల్ట్స్

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 07:00 AM IST
కాసేపట్లో గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్…తొలి రౌండ్‌లోనే మెహదీపట్నం రిజల్ట్స్

GHMC election counting : యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బల్దియా ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. హైదరాబాద్ షహర్‌ కా షా ఎవరనేది తేలిపోనుంది. గ్రేటర్‌ పీఠంపై కూర్చునేదెవరో.. మధ్యాహ్నం లోగా క్లారిటీ రానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు ఎస్‌ఈసీ సర్వం సిద్ధం చేసింది. మెహదీపట్నం నుంచి మైలార్‌దేవ్ పల్లి వరకు కౌంటింగ్ సరళి కొనసాగనుంది. మొదటి రౌండ్‌లోనే మెహదీపట్నం ఫలితం తేలిపోనుండగా.. చివరిగా మైలార్‌దేవ్‌పల్లి విజేత ఎవరో వెల్లడి కానుంది.



గ్రేటర్ పీఠం ఎవరిదో తేల్చేందుకు ఎస్‌ఈసీ సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8గంటల నుంచి బల్దియా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది. బాక్సుల్లో నిక్షిప్తమైన 11 వందల 22 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనుంది. గెలిచేది ఎవరో.. ఓడేది ఎవరో క్లారిటీ ఇవ్వనుంది. 30 కౌంటింగ్ కేంద్రాల్లో 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 166 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. ప్రతిహాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 8వేల 152మంది సిబ్బంది పాల్గొంటున్నారు.



గ్రేటర్ పరిధిలో 74లక్షల 67వేల 256 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల్లో 34లక్షల 71వేల 353మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌లో భాగంగా మొదటగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఏజెంట్ల ముందు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తారు. 25బ్యాలెట్ పేపర్లను బండిల్‌గా కట్టి.. ప్రతీ టేబుల్‌కు వెయ్యి చొప్పున పంపిణీ చేస్తారు. కౌంటింగ్ సిబ్బంది పార్టీల వారీగా బ్యాలెట్ పేపర్లను వేరు చేసి లెక్కిస్తారు. 14 టేబుల్స్‌పై 14వేల ఓట్లను లెక్కించి తొలి రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ఆ తర్వాత మరో రౌండ్ కౌంటింగ్ చేపడతారు.



ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మెహదీపట్నం టూ మైలార్‌దేవ్‌పల్లి వరకు కొనసాగనుంది. గ్రేటల్ ఎన్నికల్లో అత్యల్ప ఓట్లు పోలైన మెహదీపట్నం డివిజన్ ఫలితం మొదటగా వెలువడనుంది. మెహదీపట్నంలో కేవలం 11వేల 818ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో తొలి రౌండ్‌లోనే విజేత ఎవరో తేలిపోనుంది. ఉదయం 11గంటల్లోగా తొలి ఫలితం వెల్లడవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క మెహదీపట్నం డివిజన్‌లో మాత్రమే తొలిరౌండ్‌లో ఫలితం వెల్లడికానుంది.



14వేలకు పైగా ఓట్లు పోలైన 136 డివిజన్లలో రెండో రౌండ్‌లో విజేత ఎవరో తేలిపోనుంది. 28వేలకుపైగా ఓట్లు పోలైన 13 డివిజన్లలో మాత్రం మూడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అన్నింటి కంటే ఆఖర్లో మైలార్‌దేవ్‌పల్లి ఫలితం రానుంది. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో 37వేల 445 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మూడు రౌండ్లలో కౌంటింగ్ కొనసాగనుంది.



కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కౌంటింగ్ సెంట‌ర్‌కు ఓ ఐఏఎస్ స్థాయి అధికారిని అబ్జర్వర్‌గా నియమించారు. ప్రతీ కౌంటింగ్ హాల్‌లో ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. కరోనా నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ అధికారులతో పాటు పార్టీల ఏజెంట్లు కూడా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. మాస్క్‌లేని ఏజెంట్లను లోపలికి అనుమతించబోమన్నారు. హాల్ లోప‌ల కూడా.. ఫిజిక‌ల్ డిస్టన్స్ పాటించేలా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలలోకి సెల్ ఫోన్‌లను నిషేధించారు. అటు పార్టీ ఏజెంట్లకు రిలీవ‌ర్‌ను కూడా అనుమ‌తించ‌బోమని స్పష్టం చేశారు.



స్వస్థిక్‌ గుర్తు అటు ఇటుగా పడ్డ ఓట్లపై తుదినిర్ణయం ఎన్నికల అధికారికే ఎస్‌ఈసీ అప్పగించింది. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే ఏజెంట్ల సమక్షంలో డ్రా తీసి విజేతను ప్రకటిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పలు ఆంక్షలు విధించారు.