బర్త్ డే పార్టీకి ప్రియుడు రాలేదని సూసైడ్ చేసుకున్న ప్రియురాలు
ప్రేమించిన ప్రియుడు బిజీగా ఉండటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేసింది ప్రియురాలు. కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు చెప్పిన టైం కు రాలేక పోయాడు. మనస్తాపం చెందిన ప్రియురాలు సూసైడ్ చేసుకుంది. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శరణ్య(22) రైల్వే కానిస్టేబుల్ గా పని చేస్తూ పెరంబూర్ రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ఆమెకు చెన్నైలోని ఎస్ప్లనేడు పోలీసు స్టేషన్ లో విధులు కేటాయించారు.
శరణ్యకు కొంత కాలం క్రితం ఆర్మ్ డ్ రిజర్వు ఫోర్స్ కు చెందిన ఏలుమలై అనే కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. క్రమేణా అది వారి మధ్య ప్రేమగా మారింది. గురువారం ఏప్రిల్ 30 ఏలుమలై పుట్టిన రోజు కావడంతో శరణ్య త్వరగా తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లి ప్రియుడి బర్త్ డే వేడుకలు సిధ్దం చేసింది. సాయంత్రం 6 గంటల్లోపు క్వార్టర్స్ కు రమ్మని ఏలుమలైకు ముందే చెప్పింది. అయితే ఏలుమలైకి పేదలకు ఆహారం అందించే ప్రాంతాల్లో భద్రతా విధులు కేటాయించారు. దాంతో అతను ఆమె చెప్పిన సమయానికి ఇంటికి వెళ్లలేక పోయాడు. (అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి)
తన విధులు ముగించుకుని రాత్రి 9 గంటలకు తన ప్రియురాలు శరణ్యకు పరిస్ధితి వివరించటానికి పోన్ చేశాడు. ఆమె స్పందించలేదు.ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ లిఫ్టు చేయకపోయేసరికి అదే క్వార్టర్స్ లో ఉంటున్న ఆమె స్నేహితురాలు రాజేశ్వరికి ఫోన్ చేసి ఆమెను చూసి రమ్మని చెప్పాడు. శరణ్య క్వార్టర్స్ కు వచ్చిన రాజేశ్వరి షాక్ కు గురైంది. అప్పటికే శరణ్య ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వెంటనే ఓట్టేరి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.