ఆత్మరక్షణ కోసం అమ్మాయిలు ఎవరినైనా చంపొచ్చు: ఎంఎల్ఎస్ఏ కార్యదర్శి

ఆత్మరక్షణ కోసం అమ్మాయిలు ఎవరినైనా చంపొచ్చు: ఎంఎల్ఎస్ఏ కార్యదర్శి

Girls can kill in selfdefence : ఆత్మ రక్షణ కోసం అమ్మాయిలు ఎవరినైనా చంపొచ్చని..అది నేరం కాదనీ అది చట్టం కల్పిస్తున్న హక్కుల్లో ఒకటని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (MLSA) కార్యదర్శి ఎం రాధాకృష్ణ చౌహాన్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గోల్కొండలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి సేఫ్టీ కోసం అమ్మాయిలు ఎప్పుడూ తమ వెంట పెప్పర్ స్ర్పే దగ్గరుంచుకోవాలని సూచించారు.

చట్టంలో చెప్పిన దాని ప్రకారం..తమ ఆత్మరక్షణ కోసం ఎవరినైనా ఓ అమ్మాయి చంపితే అది నేరం కాదని అన్నారు. బాలికలు,యువతులు, మహిళలకు రక్షణగా నిలుస్తున్న కొన్ని చట్టాల గురించి పలు విషయాలను చెబుతూ రాధాకృష్ణ వివరించారు. అమ్మాయిలు ఎప్పుడూ తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లాలని సూచించారు. మహిళా హక్కుల కోసం తెలుసుకోవాలని..వారికి ఎటువంటి చట్టాలున్నాయి? వాటిని ఎటువంటి సందర్భాల్లో ఎలా వినియోగించుకోవచ్చు? అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎం రాధాకృష్ణ చౌహాన్ సూచించారు.

వివిధ రంగాలకు చెందిన గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలని, వారు చెప్పిన విషయాలను రోజువారీ జీవితంలో అన్వయించుకోవాలని..ఆచరించాలని సూచించారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏమాత్రం తీసిపోరని అన్నారు. చదువుల్లోను..క్రీడల్లోను మంచి ప్రతిభ కనబరుస్తున్న విద్యార్దులే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి న్యాయసహాయంక ప్యానెల్ అడ్వకేట్ మహ్మద్ ఆఫ్జల్, ప్రధానోపాధ్యాయుడు వాజిత్ హష్మి ఇంకా తదితరులు హాజరయ్యారు.