Hyderabad Nims Hospital : నిమ్స్ హాస్పిటల్ ఆధునీకరణకు రూ.1,571 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
నిమ్స్ ఆస్పత్రి విస్తరణ కోసం ఎర్రమంజిల్లో.. ఆర్ అండ్ బీకి చెందిన 32 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఆర్ అండ్ బీ భూమిని కేటాయించడంతో పాటు.. భవన నిర్మాణ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆస్పత్రి విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.1,571 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
Hyderabad Nims Hospital : వైద్యం..! ఎంతో ఖరీదైపోయింది. టెస్టులకు వేలల్లో.. వైద్యానికి లక్షల్లో.. ఫీజులు గుంజుతున్న రోజులివి. ఇక పేదోడికి ఏ గుండెజబ్బో.. క్యాన్సరో.. వచ్చిందంటే.. అంతే సంగతులు.. స్పెషాలిటీ పేరుతో ఎంత ఫీజులు పీల్చేస్తారో చెప్పలేం.! ఓ పేదోడికి రొగమొస్తే.?అమ్మో ఇక ప్రాణాలమీద ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి. కాదు కాదు దస్థితి. కానీ పేదవాడికి రోగమొస్తే నేనునంటోంది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆస్పత్రి..అదే నిమ్స్ హాస్పిటల్.నాణ్యమైన వైద్యం.. కచ్చితమైన వైద్య పరీక్షలు.. స్పెషలిస్ట్ డాక్టర్లు.. ప్రపంచస్థాయి అత్యుత్తమ వైద్య సేవలందిస్తూ.. పేదోడి పాలిట సంజీవనిగా సగర్వంగా నిలబడింది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇప్పుడు పేదోడి సేవలో తరించేందుకు సరికొత్తగా సిద్ధమవుతోంది నిమ్స్ ఆస్పత్రి.
హైదరాబాద్ నగర నడిబొడ్డున కొలువైన నిమ్స్ ఆస్పత్రి అంటే తెలియని వారుండరు. హైదరాబాద్.. తెలంగాణ.. ఏపీనే కాదు.. సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా సామాన్యులు.. నాణ్యమైన వైద్యం కోసం నిమ్స్కి వస్తుంటారు. అత్యాధునిక పరికరాలతో కచ్చితమైన రోగ నిర్ధారణ పరీక్షలు.. ప్రపంచం మెచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు.. అత్యాధునిక వైద్య సేవలు.. అతి తక్కువ ఖర్చుతో దొరికే ఏకైన హాస్పిటల్ కావడంతో నిమ్స్కి క్యూ కడుతుంటారు. అంత ప్రత్యేకత ఉండడం వల్లే ఎప్పుడూ వచ్చీపోయే ఇన్పేషెంట్లు.. ఔట్ పేషెంట్లు.. వారి బంధువులతో కిటకిటలాడుతుంటుందీ ఆస్పత్రి. ఖరీదైన వైద్యం చేయించుకోలేని అతి సామాన్యులు.. సామాన్యులకి నిమ్స్ కేరాఫ్ అడ్రస్. కార్పొరేట్ కల్చర్ పుణ్యమాని వైద్యం సామాన్యుడికి అందని ద్రాక్షగా తయారైనా.. పేదోడి ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోంది నిమ్స్ ఆస్పత్రి.
పేదోడి వైద్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోన్న నిమ్స్.. ఇక మరింత సూపర్గా సేవలందించేందుకు రెడీ అవుతోంది. సుమారు 1,571 కోట్ల రూపాయలతో అధునాతన భవనాలు.. అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. పేదలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా.. మరో 2 వేల బెడ్లతో కొత్త ఆస్పత్రి నిర్మాణం కానుంది. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో 1800 పడకలు అందుబాటులో ఉన్నాయి. మరో 2 వేల పడకలు ఏర్పాటు చేయడం ద్వారా.. నిమ్స్ సామర్థ్యం 3800 పడకలకు పెరగనుంది. వాటిలో 500 బెడ్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి.. మాతా శిశు కేంద్రానికి 250 బెడ్లు కేటాయించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 2 వేల పడకలూ ఆక్సిజన్ బెడ్లు కావడం విశేషం.
నిమ్స్ విస్తరణ కోసం ఎర్రమంజిల్లో.. ఆర్ అండ్ బీకి చెందిన 32 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఆర్ అండ్ బీ భూమిని కేటాయించడంతో పాటు.. భవన నిర్మాణ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆస్పత్రి విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.1,571 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయానికి అయ్యే నిధులను వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడానికి తెలంగాణ సూపర్ స్పెషాలిటీ కార్పొరేషన్ లిమిటెడ్కు నోడల్ ఏజెన్సీగా SBIక్యాప్స్ను నియమించింది…
చారిత్రాత్మక నిమ్స్ ఆస్సత్రి ఆధునీకరణతో పాటు.. సూపర్ స్పెషాలిటీ విభాగాలను కూడా మరింత బలోపేతం చేయనున్నారు. గుండె.. కిడ్నీ.. బ్రెయిన్.. క్యాన్సర్.. ఆర్థోపెడిక్ వంటి సుమారు 42 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను నిమ్స్ అందించనుంది. ప్రస్తుతం 30కిపైగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. వాటిని 42కి పెంచనున్నారు. అందుకు అనుగుణంగా వైద్యులు.. నర్సులు.. సిబ్బందిని కూడా కేటాయించనున్నారు. మెడికల్ కాలేజీ.. నర్సింగ్ కాలేజీల్లో సీట్లు కూడా పెరగనున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చాక వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు.. పది వేల పడకలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి నాలుగువైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్- టిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోంది. వాటిలో వెయ్యి చొప్పున 4 వేల బెడ్లు.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 2 వేలు.. నిమ్స్ ఆధునీకరణతో 3,800 సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి.