పోలీసులపై స్టింగ్ ఆపరేషన్…నలుగురు జర్నలిస్ట్ లపై FIR నమోదు

  • Published By: venkaiahnaidu ,Published On : December 6, 2020 / 04:04 PM IST
పోలీసులపై స్టింగ్ ఆపరేషన్…నలుగురు జర్నలిస్ట్ లపై FIR నమోదు

FIR Against 4 Journalists న‌లుగురు జ‌ర్న‌లిస్టుల‌పై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో… స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు నలుగురు జర్నలిస్ట్ లు ఓ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.



కాగా, న‌వంబ‌ర్ 27న రాజ్‌ కోట్‌ లోని కొవిడ్‌-19 హాస్పిటల్ లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించి ఐదుగురు పేషెంట్లు చ‌నిపోయిన విషయం తెలిసిందే. అయితే,ఈ కేసు పురోగ‌తి తెలుసుకునేందుకు డిసెంబ‌ర్ -1 రాత్రి నలుగురు జర్నలిస్ట్ లు(ముగ్గురు రిపోర్టర్లు,ఒక ఫొటోగ్రాఫర్) స్టింగ్ ఆప‌రేష‌న్ పేరుతో రాజ్ కోట్ తాలుకా పోలీస్ స్టేష‌న్‌ లోకి ప్ర‌వేశించారు. 2వ తేదీన ఫోటోల‌తో స‌హా ఓ వార్త‌ను స్థానిక వార్తాపత్రికలో ప్ర‌చురించారు.



హాస్పిటల్ లో అగ్నిప్రమాదం కేసులో అరెస్ట్ కాబడిన ముగ్గురు నిందితుల‌ను లాకప్‌లో వేయ‌కుండా పోలీస్ స్టాప్‌ రూంలో ఉంచి వారికి వీఐపీ మ‌ర్యాద‌లు చేస్తున్నారంటూ వార్త‌ను ప్ర‌చురించారు. అదేవిధంగా స్టేష‌న్‌లో తీసిన వీడియో క్లిపింగ్స్‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. అయితే, ఈ వార్త‌ను ఖండించిన పోలీసు అధికారులు ఖండించారు. నవంబర్-30న అగ్నిప్రమాదం కేసులో ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.



నిందితులను విచార‌ణ నిమిత్తం గ‌దిలో కూర్చొబెట్టిన‌ట్లు,వీఐపీ ట్రీట్మెంట్ కోసం కాదని పోలీసు అధికారులు తెలిపారు. నలుగురు జర్నలిస్ట్ లు అస‌త్య క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేశార‌న్నారు. న‌లుగురు జ‌ర్న‌లిస్టుల‌పై ఐపీసీ సెక్ష‌న్ 186 (ప్ర‌భుత్వ సిబ్బంది విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం) సెక్ష‌న్ 114 ( ఉద్ధేశ‌పూర్వ‌క నేరానికి పాల్ప‌డ‌టం), అదేవిధంగా సమాచార సాంకేతిక చట్టం నిబంధనలు ఉల్లంఘించ‌డం కింద జ‌ర్న‌లిస్టుల‌పై కేసులు న‌మోదు చేశారు. నలుగరు జర్నలిస్ట్ లు అనుమతి లేకుండా నిషేధిత ఏరియాలోకి ప్రవేశించారని పొలీసు అధికారులు తెలిపారు.