ముంబైలో ఓ వైపు కరోనా..మరోవైపు భారీ వర్షాలు, వణుకుతున్న జనాలు

  • Published By: madhu ,Published On : July 5, 2020 / 08:51 AM IST
ముంబైలో ఓ వైపు కరోనా..మరోవైపు భారీ వర్షాలు, వణుకుతున్న జనాలు

కరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది.

ముంబయిలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రాగల 24 గంటల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ఐఎండీ ప్రకటించింది. ముంబైతోపాటు… పాల్‌గ‌ఢ్‌, రత్నగిరి, రాయ్‌గఢ్, థానేలలోనూ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

భారీ వర్షాలతో జన జీవనం స్తంభించిపోవడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. వర్షాలతో విరిగిపడిన చెట్లను రహదారులపై నుంచి తొలగిస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. థానే, రత్నగిరి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

శుక్ర‌వారం కురిసిన వర్షాలకే ముంబై అతలాకుతలమైంది. ఏక‌ధాటిగా మూడు గంటలపాటు కుండ‌పోత‌ వాన కురిసింది. 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదర్, మాతుంగా, వర్లినాకా, లాల్‌బాగ్, కింగ్స్ సర్కిల్, సియోన్, కుర్లా, అంధేరీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా హింద్‌మాతా, గోల్డ్ ఈవల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావ‌డంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.

న‌గ‌రంలోని మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిప‌డ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. కాగా, భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ సిబ్బంది, విప‌త్తు నిర్వ‌హ‌న ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మై స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి.