MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్.. ఆయనపై పీడీ చట్టం రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా భాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
MLA Raja Singh: హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, ఆయనపై పీడీ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు నిర్వహించకూడదని, చెప్పింది. అలాగే, మూడు నెలల పాటు సామాజిక మాధ్యమాల్లో ఆయన వీడియోలు పోస్ట్ చేయొద్దని పేర్కొంది. మీడియా, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది.
రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా భాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాదనల సందర్భంగా ఇప్పటికే సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ కౌంటరు దాఖలు చేశారు.
రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే, సర్కారు దాఖలు చేసిన కౌంటర్ ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్ కూడా హైకోర్టుకు వాదనలు వినిపించారు. గతంలో పీడీ చట్టం కింద నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలను గుర్తుచేశారు.
నిన్న వాదనలు ముగించిన హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నేడు రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. ఆగస్టు 25 తేదీన పీడీ యాక్ట్ పై జైలుకి వెళ్లారు రాజాసింగ్. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత బెయిల్ పై బయటకు రానున్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..