Munugode By Poll : రేపు అమిత్ షా మునుగోడు పర్యటన షెడ్యూల్ ఇదే..
కేంద్ర హోంమంత్రి మునుగోడు పర్యటన ఖారారు అయ్యింది. ఆగస్టు 21 మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న క్రమంలో అమిత్ షా ఈ సభకు హాజరుకానున్నారు.
Amith Sha Munugode Schedule : కేంద్ర హోంమంత్రి మునుగోడు పర్యటన ఖారారు అయ్యింది. ఆగస్టు 21 (8,2022) మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న క్రమంలో అమిత్ షా ఈ సభకు హాజరుకానున్నారు. అమిత్ షా ఆగస్టు 21న మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అనంతరం 4.35 నుంచి 4.50 గంటల వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో రివ్వ్యూ చేస్తారు. అనంతరం సాయంత్రం 4.50 గంటల నుంచి 6 గంటల వరకు మునుగోడు సభలో పాల్గొంటారు.ఈ సభలో షా ప్రసంగిస్తారు.
సభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. మునుగోడు పర్యటన క్రమంలో సీఆర్పీఎఫ్ అధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులతో భద్రతపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా పక్కా వ్యూహాలతో కాషాయదళం మునుగోడు యుద్ధానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే పలువురు నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. దీంట్లో భాగంగానే ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మునుగోడు సభకు అమిత్షా వస్తుండటంతో.. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం.. మండలానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జ్లను నియమించింది.
మునుగోడు బహిరంగ సభలో పార్టీ చేరికలపై రాష్ట్ర అధిష్ఠానం ప్రధానంగా దృష్టి సారించింది. అమిత్ షా సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలు భాజపాలో చేరనున్నారు. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్రెడ్డి టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. కాంగ్రెస్కి చెందిన సీనియర్ నేతలతో పాటు.. తెరాస అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు..బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.మరోవైపు మునుగోడు ఉపఎన్నిక గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయని.. బీజేపీకి ఈ ఉప ఎన్నిక విజయం ఊపును తీసుకొస్తుందని..కాషాయ శ్రేణులు భావిస్తున్నారు.