హైదరాబాద్‌లో అద్దెలు తగ్గాయి.. ఎటు చూసిన To-Let బోర్డులే!

  • Published By: veegamteam ,Published On : June 28, 2020 / 04:32 PM IST
హైదరాబాద్‌లో అద్దెలు తగ్గాయి.. ఎటు చూసిన To-Let బోర్డులే!

కరోనాకు ముందు అద్దెకు ఇల్లు దొరకలాంటే కటకట.. వేలకు వేలు పోసిన ఒక గది అద్దెకు దొరకడమే కష్టమైపోయింది అప్పడు. ఆఫీసు దగ్గరగా ఉంటుందిలేని కొంచెం కాస్టలీ ఏరియాల్లో అద్దెకు తీసుకుందామని చూస్తే.. అగ్గిపెట్టంత గదికి వేలకు వేలు పోయాల్సి వచ్చేది. చేసే ఉద్యోగంలో వచ్చే జీతం.. సగం అద్దెలకు కట్టడంతోనే సరిపోయేది.

భారీగా పెరిగిపోయిన అద్దెలు కట్టలేక జీతం సరిపోక మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోయాయి. కరోనా తర్వాత ట్రెండ్ మారింది. ఫారెన్ నుంచి హైదరాబాద్ గల్లీ దాకా.. కరోనా ఫోబియా పట్టుకుంది. ఒకప్పుడు ఫారెన్ అంటే పరుగులు పెట్టిన వారంతా.. కరోనా అని చెప్పగానే ఫారెన్ అంటే భయంతో పారిపోతున్నారు. కరోనా పుణ్యామని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అద్దెల ధరలు దిగొచ్చాయి. ఎక్కడా చూసినా అన్ని చోట్ల టూ-లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

 

కరోనా దెబ్బకు సిటీలో ఉపాధి కోసం వచ్చినవారంతా తిరిగి ఇంటిబాట పట్టేశారు. దాంతో అద్దెకు గదులన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు కరోనా భయంతో ఉన్నచోట నుంచి అద్దె ఇళ్లు మారాలన్నా వణికిపోతున్నారు. అమ్మో… ఉన్నచోటే నయం.. కొన్నాళ్ల వరకు ఇళ్లు మారే ప్రయత్నం చేయకపోవడమే మంచిదని అంటున్నారు.

 

ఇంకొంతమంది తమ భార్యా పిల్లల్ని సొంతూళ్లకు పంపిస్తున్నారు. మరికొందరేమో సొంతూరుకు వెళ్లడమే బెటర్ అంటూ వెళ్లిపోయారు. అద్దెకు దిగేవారు లేక.. నగరంలో చాలా అద్దె ఇళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అద్దె ఎక్కువగా ఉంటే వచ్చేవారు కూడా రారని చేసేదేం లేక అద్దెలు తగ్గిస్తున్నారంట ఇంటి యజమానులు..

 

అద్దెలు రాక.. కొన్న ఇంటికి ఈఎంఐలు కట్టలేక.. :

ఇదిలా ఉంటే.. వలస జీవులు నివసించే వనస్థలిపురం, కూకట్ పల్లి, పటాన్ చెరు, ఎల్బీనగర్, ఈఎస్ఐ ప్రాంతాల్లో ప్రతి పది భవనాలకు ఆరింట భవనాల ముందు టులెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అద్దెలు తగ్గడంతో ఇదే సరైన సమయమని ఇళ్లు మారే వారు లేకపోలేదు. అద్దెల మీద వచ్చిన డబ్బుతో ఈఎంఐలు కట్టే కొత్త ఇంటి యజమానులంతా లబోదిమంటున్నారు. అద్దెకు ఉండే వారు లేక.. నెలకు ఈఎంఐ కట్టేందుకు డబ్బులు సరిపోక గందరగోళ పరిస్థితుల్లో కనిపిస్తున్నారు.

 

వెలవెలబోతున్న అపార్ట్‌మెంట్లు :

మరోవైపు.. కరోనా దెబ్బకు కోచింగ్ సెంటర్లు, వ్యాపార సముదాయాలు ఖాళీ అవుతున్నాయి. ఒకప్పుడు ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్నా అమీర్ పేట.. దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో చిన్న గది దొరకడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అపార్ట్ మెంట్లే ఖాళీగా వెలవెల బోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం జనం లేక నిర్మూనుష్యంగా కనిపిస్తున్నాయి. కమర్షియల్ వ్యాపారాలు కూడా చతికలపడ్డాయి. ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా టూ-లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

 

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఇన్ని టూలెట్లు బోర్డులు కనిపించడానికి కారణం.. లాక్ డౌన్… ఉపాధి లేక చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారని అంటున్నారు. వ్యాపారం లేక అద్దెలు కట్టలేక చేతులేత్తేస్తున్నారు. ఖాళీ చేయడంతో దాంతో భవన యజమానులు తమ భవనాలకు అద్దె కోసం టూలెట్లు పెడుతున్నామని చెబుతున్నారు. కొందరు అయితే ఇచ్చిన అడ్వాన్సులను ఇవ్వమని యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలా అనేక కారణాలతో నగరంలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నెల రోజుల ముందే హాస్టల్స్ కూడా ఖాళీ అయిపోయాయి.