Bonalu : జులై 17న ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

జులై 17న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

Bonalu : జులై 17న ఉజ్జయిని మహంకాళి  బోనాలు.. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Bonalu In Hyderabad 2022

Mahankali bonalu in Hyderabad : ఆషాడ మాసం వచ్చింది అంటే హైదరాబాద్ మహానగరంలో బోనాల సందడి నెలకొంటుంది. అలాగే ఇక ఆషాడ మాసం వస్తోంది. దీంతో నగరంలో బోనాల సందడి మొదలుకానుంది. దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జులై 17న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం (జూన్ 2022)వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బాటా నుంచి రాంగోపాల్ పేట ఓల్డ్ పోలీసు స్టేషన్ వరకు చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం..ఆలయ పరిసరాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. రోడ్డు పనులను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.ఉత్సవాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని..వారికి ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల తోపులాట లేకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు.

అలాగే..శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని..ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అమ్మవారికి బోనాలు తీసుకొచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.