Sri Lanka Crisis: గొటబాయను దేశం దాటించారంటూ భారత్పై తప్పుడు ప్రచారం.. ఘాటుగా స్పందించిన భారత హైకమిషన్
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు.
Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రోడ్లపైకొచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో గత నాలుగు రోజుల క్రితం శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ దేశ ప్రజలు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు భద్రతను చేధించుకొని లోపలికి దూసుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గొటబాయ అధ్యక్ష భవనం నుంచి పరారయ్యాడు. అయితే గొటబాయ దేశం విడిచి వెళ్లారని ఆ దేశ మీడియా పేర్కొంది. కానీ, సోమవారం గొటబాయ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘేకు ఫోన్ చేసి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
Sri Lanka Crisis: శ్రీలంకను సర్వనాశనం చేసిన ‘ఆ నలుగురు’..నెత్తికెక్కిన అధికారాన్ని కాలరాసిన లంకేయులు
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులుకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు. శ్రీలంక రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తర్వాతే గొటబాయ, ఆయన భార్య సైనిక విమానంలో మల్దీవులకు వెళ్లారని సైన్యం వెల్లడించింది. తొలుత మాలెలో దిగేందుకు అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అనుమతి ఇవ్వలేదని, మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ మజ్లిస్, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ జోక్యం చేసుకొని గొటబాయ విమానం ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమం చేశారని తెలిపారు. ఆంటొనొవ్ సైనిక విమానంలోనే గొటబాయ దేశం విడిచినట్లు ధ్రువీకరించారు.
High Commission categorically denies baseless and speculative media reports that India facilitated the recent reported travel of @gotabayar @Realbrajapaksa out of Sri Lanka. It is reiterated that India will continue to support the people of Sri Lanka (1/2)
— India in Sri Lanka (@IndiainSL) July 13, 2022
గొటబాయ దేశం వదిలి వెళ్లేందుకు భారత్ దేశం సహకరించిందంటూ శ్రీలంకలోని పలు మీడియా సంస్థల్లో వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ వార్తలను భారత హైకమిషన్ ఖండించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించింది. గొటబాయ దేశం విడిచి వెళ్లేందుకు భారత్ సహకరించిందంటూ శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు నిరాధారమైన వార్తలను ప్రసారం చేస్తున్నాయని, వీటిల్లో ఎలాంటి నిజంలేదని, కేవలం అవి ఊహాజనితమైన వార్తలేనంటూ భారత్ హైకమిషన్ పేర్కొంది. ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది.