నెహ్రూ నుంచి మోడీ వరకు.. ప్రధానమంత్రులు వాడిన కార్లు ఇవే!
భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటోంది దేశం. ఊరూవాడ మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ఈ ప్రత్యేక సంధర్భంలో మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన స్పెషల్ కార్ల గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన టాప్-5 కార్లేమిటంటే..
రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్:
స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. కార్లలో తిరగడానికి తెగ ఇష్టపడేవారట. అనేక అమెరికన్ మరియు బ్రిటీష్ వాహనాలలో ఆయన తిరిగారు. భారత ప్రధానమంత్రికి మొదటి అధికారిక కారు రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్. ఈ కారును నెహ్రూకు లార్డ్ మౌంట్ బాటన్ స్వయంగా బహుమతిగా ఇచ్చాడు. ఈ వాహనాన్ని ప్రధాన మంత్రి చాలా సంవత్సరాలు ఉపయోగించారు.
మెర్సడెస్-బెంజ్ 500 ఎస్ఈఎల్:
80 వ దశకంలో రాజీవ్ గాంధీ భారత ప్రధాని అయ్యాక మారుతీ సుజికీలో తిరిగేవారు.. అయితే చాలా వేగంగా దూసుకుపోయే కార్లంటే రాజీవ్ గాంధీకి చాలా ఇష్టం. జోర్డాన్ రాజు నుండి బహుమతిగా అందుకున్న రేంజ్ రోవర్ వాగ్యు నుంచి మెర్సడెస్-బెంజ్ 500 ఎస్ఈఎల్ వరకు అనేక కార్లు ఆయన దగ్గర ఉండేవి. అత్యున్నత హోదాలో ఉండేవారు తమ కారును వారే నడుపుకోరు. ప్రత్యేకంగా డ్రైవర్ని నియమించుకుని, వారితో నడిపిస్తారు. కానీ రాజీవ్ గాంధీ అలా కాదంట. డ్రైవర్ను పక్కసీట్లో కూర్చో పెట్టుకుని, తానే స్వయంగా డ్రైవ్ చేసేవారట.
మెర్సడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమౌసిన్:
భారత్ తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ శంకర్ దయాల్ శర్మ బుల్లెట్, గ్రెనేడ్ ప్రూఫ్ మెర్సడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమౌనిస్ వాడిన తొలి అధ్యక్షుడు. మెర్సడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమౌసిన్, వీఆర్9-లెవల్ బాలిస్టిక్ ప్రొటెక్షన్ను కలిగి ఉంది. .44 క్యాలిబర్, సైనిక రైఫిల్ షాట్లు, బాంబులు, గ్యాస్ దాడుల నుంచి ఇది కాపాడుతోంది.
పార్లమెంట్పై దాడి తర్వాత మారిన కారు:
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన రాజకీయ నాయకులలో ఒకరైన అటల్ బిహారీ వాజ్పేయి హిందూస్తాన్ అంబాజిడర్ను ఉపయోగించేవారు. అయితే, 2001 లో పార్లమెంట్ హౌస్పై ఉగ్రవాద దాడి తరువాత బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ హై-సెక్యూరిటీకి మారారు. బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ హై-సెక్యూరిటీని ఉపయోగించిన మొదటి ప్రధాని వాజ్పేయ్ గారే.
హిందూస్తాన్ అంబాసిడర్:
అన్ని రాష్ట్రాల అధిపతులు ఐకానిక్ హిందూస్తాన్ అంబాసిడర్నే ఎక్కువగా ఎంచుకునేవారు. దీన్ని ప్యుగోట్కు అమ్మడానికి కంటే ముందస్తు వరకు కూడా ముఖ్యమంత్రులు చాలా వరకు ఈ వాహనాన్నే వాడేవారు. 1958 నుంచి 2014 వరకు ఈ అంబాసిడర్ను తయారు చేశారు. హిందూస్తాన్ మోటార్స్ ఆఫ్ ఇండియా రూపొందించేది. ఐకే గుజ్రాల్ పదవీ కాలంలో ఈ అంబాసిడర్ను మోస్ట్ లోయల్ వెహికిల్గా పరిగణించేవారు. పీవీ నరసింహరావు, హెచ్డీ దేవే గౌడ అంబాసిడర్నే తమ వాహనంగా వాడేవారు.
బీఎండబ్ల్యూ 7-సిరీస్ 760 లి:
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంబాసిడర్ నుంచి బీఎండబ్ల్యూ 7-సిరీస్ 760 లికి మారారు. ప్రస్తుత ప్రధాని మోడీ కూడా దీనినే తన అధికారిక వాహనంగా వాడుతున్నారు. దీని ఖరీదు సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఈ వాహనానికి వీఆర్ 7 సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఏకే47ను, అధిక తీవ్రత పేలుళ్లను, అలాగే రోడ్డు పక్కన బాంబు పేలుళ్లను తట్టుకోగలదు. 7 సిరీస్ 760 లి వాహనం హెవీ షీట్ మెటల్ను కలిగి ఉండి, 4 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది.
రేంజ్ రోవర్ స్పోర్ట్…
టాటా మోటార్స్కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్లో ప్రయాణించడానికి కూడా మోడీ ఎక్కువగా ఇష్టపడతారు. ఇటీవల ఫుల్-సైజ్ ఎస్యూవీని వాడుతున్నారు. తేలికగా కారులో నుంచి బయటికి వెళ్లడానికి, లోపలికి వెళ్లడానికి ఇది బాగుంటుంది. పానోరామిక్ సన్రూఫ్ కూడా ఉంటుంది. దీంతో కారు బయటికి రాకుండానే ప్రధాని ప్రజలకు అభివాదం చెయ్యవచ్చు. బీఎండబ్ల్యూ 7-సిరీస్ 760 లి మాదిరిగానే రేంజ్ రోవర్ స్పోర్ట్ కూడా వీఆర్7 గ్రేడ్తో బాలిస్టిక్ ప్రొటెక్షన్ను కలిగి ఉంది. గ్యాస్ అటాక్ జరుగకుండా గ్యాస్-సేఫ్ ఛాంబర్ కూడా ఏర్పాటు చేశారు. థిక్ బుల్లెట్-ప్రూఫ్ విండోలు, వెహికిల్ పైన సాయుధ ప్లేట్లు ఉంటాయి.