36 కేంద్రాల్లో ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాల్యుయేషన్ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. మొత్తంగా 36 సెంటర్లలో స్పాట్ వ్యాల్యుయేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. రానున్న మూడు రోజుల్లో కోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 9 లేదా 10 నుంచి వ్యాల్యుయేషన్ ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నారు. జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు పంపేందుకు సమయం పట్టినా, కోడింగ్ ఆలస్యమైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 12 నుంచి అసలైన వ్యాల్యుయేషన్ ప్రారంభించాలని బోర్డు స్పష్టం చేసింది.
ఆ రోజు నుంచి ఒక్కో అధ్యాపకుడు రోజూ 45 జవాబు పత్రాలు వ్యాల్యుయేషన్ చేసేలా ప్రణాళికలను రెడీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 6,200 మంది ప్రభుత్వ, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. ప్రభుత్వ మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో మరో 5 వేల మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో మరో 25 వేల మంది లెక్చరర్లు ఉన్నారు. మొత్తం 36,200 మంది వరకు లెక్చరర్లు ఉన్నారు. దాదాపు 15 వేల మందితో మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ఇంటర్ ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారు. ప్రథమ సంవత్సర జవాబు పత్రాల వాల్యుయేషన్ ఉంటుంది. విధుల్లో పాల్గొనే వారికి రవాణా, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్పాట్ వ్యాల్యుయేషన్లో వీలైనంత ఎక్కువ మంది లెక్చరర్లు పాల్గొనాలి. జేఈఈ వంటి ఇతర పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఫలితాలపై మానసిక ఆందోళన లేకుండా చూసేందుకు త్వరగా వ్యాల్యుయేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూల్యాంకన కేంద్రాల్లో హై శానిటైజేషన్ ఏర్పాట్లు చేయాలి.