KGF Babu : కేజీఎఫ్ బాబు ఇంటిపై ఐటీ దాడులు
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.
KGF Babu : ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ కేజీఎఫ్ బాబుకు సినిమాకు ఏమిటి సంబంధం అంటారా. ఈ కేజీఎఫ్ బాబు కూడా కోలార్ లోనే అతి పేదరికంలో పుట్టి పెరిగి ఈ రోజు కోట్లాది రూపాయలు ఆర్జించాడు. 20 ఏళ్లలో చిత్తు కాగితాలు, పాత సామాన్ల వ్యాపారం నుంచి కోట్ల రూపాయల ఆస్ధులు సంపాదించిన స్ధాయికి ఎదిగాడు. ప్రస్తుతం కర్ణాటకలో కోట్లాది రూపాయలను అక్రమంగా బదిలీ చేశారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు.
కర్ణాటకలో ప్రముఖ వ్యాపారవేత్త కేజీఎఫ్ బాబు అలియాస్ ఉమ్రా బాబు అలియాస్ యూసుఫ్ షరీఫ్ నివాసంపై మే 28, శనివారం ఉదయం సుమారు 6 కార్లలో, పెద్ద ఎత్తున పోలీసులు,సీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో వచ్చిన 20 మంది ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు. బెంగళూరు వసంతనగరలోని రుక్సానా ప్యాలెస్, ఉమ్రా డెవలపర్స్, ఉమ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ, ఈడీ అధికారులు ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు కేజీఎఫ్ బాబు. ఆసమయంలో తన ఆదాయాన్ని రూ.1741 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబు నామినేషన్ పత్రాల్లో రూ.97.98 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1643 కోట్ల విలువైన స్థిరాస్తులను ప్రకటించారు. మొత్తం ఆస్తులు రూ.1,741.57 కోట్లుగా తెలిపారు. ఇద్దరు భార్యల పేరుతో రూ.3.5 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కోలార్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నిక్లలో నిలబడేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బెంగళూరు వసంతనగరలోని రుక్సానా ప్యాలెస్, ఉమ్రా డెవలపర్స్, ఉమ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ, ఈడీ అధికారులు ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులను, బ్యాంకు లావాదేవీల రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. కేజీఎఫ్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రుక్సానా, కుమారుడు అఫ్ఘాన్తో పాటు కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న మొత్తం 23 బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నారు. కేజీఎఫ్ బాబు తన పేరుతో 12 బ్యాంకు అకౌంట్లు తెరిచారు. కుటుంబ సభ్యుల అకౌంట్లలో రూ.70 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తనిఖీలో తెలిసింది.
కేజీఎఫ్ బాబు బాండ్లు,షేర్లు, మ్యూచువల్ పండ్స్లో రూ.17.62 కోట్లు పెట్టుబడులు పెట్టారు. రూ.58.12 కోట్లు ఇతరులకు రుణాలుగా ఇచ్చారు. రూ.2.09 కోట్ల విలువచేసే రోల్స్రాయిస్ కారు ఉంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు చెందిన విలాసవంతమైన రూ.6 కోట్ల విలువ చేసే ఈ రోల్స్రాయ్స్ కారును కేజీఎఫ్ బాబు ఒక మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేశాడు. గత ఏడాది ఆగస్టులో యుబీ సిటీ వద్ద కారును ఆర్టీఓ అధికారులు సరైన పత్రాలు లేవని సీజ్ చేశారు. వాటికి సంబంధించిన పన్నులు చెల్లించిన తర్వాత అధికారులు కారును విడుదల చేశారు. ఇంకా అనేక కార్లు ఉన్నట్లు తెలిపారు.
బాబుకు అనేక రియాల్టీ కంపెనీలు ఉన్నాయి. టీనో ల్యాండ్ డెవలపర్స్, హిల్ల్యాండ్ బిల్డ్కాన్, ఉమ్రా బ్రదర్స్, ఉమ్రా డెవలపర్స్, అపనాన్ డెవలపర్స్, హిల్ల్యాండ్ ప్రాపర్టీస్, జుమేరా కన్స్ట్రక్షన్స్, జామ్జామ్ బిల్డర్స్, ఎంవీఆర్ సెక్యూరిటీస్ సహా సుమారు 10 సంస్థలకు ఆయన అధిపతిగా ఉన్నారు. ఉమ్రా డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా వందలాది కోట్ల నగదు లావాదేవీల గురించి ఈడీ అధికారులకు ఒకనెల క్రితమే సమాచారం అందింది. విచారణకు రావాలని కేజీఎఫ్ బాబుకు ఈడీ సమన్లు జారీచేసింది. మైసూరులో కేజీఎఫ్ బాబు బంధువు రెహమాన్ఖాన్ ఇంటిలోనూ సోదాలు సాగాయి. మరికొన్ని రోజులు సోదాలు కొనసాగే అవకాశముంది.
కేజీఎఫ్ బాబు బాల్యం
యూసుఫ్ షరీఫ్ బాబు అలియాస్ కేజీఎఫ్ బాబు కోలార్ జిల్లాలోనే పుట్టి పెరిగాడు. బాబు పేద కటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను అనుభవించాడు. అతని తండ్రికి 14 మంది సంతానం. వారిలో పెద్దవాడు కేజీఎఫ్ బాబు. తండ్రి ఒక చిన్న బేకరీని నిర్వహిచేవాడు. తండ్రి ఆర్ధికంగా చితికిపోవటంతో యూసుఫ్ అప్పుడప్పుడు ఆటో నడిపేవాడని కూడా చెబుతారు. బంధువుల వద్ద అప్పు తీసుకుని 2001 లో చిత్తు కాగితాలు, స్క్రాప్ వ్యాపారం మొదలు పెట్టాడు.
ఆసమయంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో ముడి బంగారాన్ని శుధ్ది చేయటానికి ఉపయోగించే 21 మిల్ ట్యాంకులను వేలం వేయాలని భారత గోల్డ్ మైన్స్ సంస్ధ నిర్ణయించింది. తన దగ్గర ఉన్న వనరులు అన్నీ పోగుచేసి ఏడు లక్షల రూపాయలకు వాటిని కొనుగోలు చేసిన బాబు వాటిని అమ్మటం ద్వారా చాలా లాభాలను సంపాదించాడు.
2002 లో పాత జావా మోటారు సైకిల్ ఫ్యాక్టరీని కోటి రూపాయలకు కొన్నాడు. దాని నుంచి 3 రెట్లు లాభం పొందాడు. అక్కడి నుంచి అతను ఇంక వెనక్కు తిరిగి చూసుకోలేదు. కోర్టు ద్వారా వేలానికి వచ్చే ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను వేలం ద్వారా కొనుగోలు చేయటం ప్రారంభించాడు. ఆతర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి కోట్లాది రూపాయలను ఆర్జించాడు. యూసఫ్ షరీఫ్ పై మూడు క్రిమిల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తన అఫిడవిట్ లో పేర్కోన్నాడు.