Malla Reddy IT Raids : 2రోజుల్లో రూ.8కోట్లకు పైగా సీజ్.. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అటాక్

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా రెండో రోజూ ఐటీ సోదాలు కంటిన్యూ అయ్యాయి. రెండు రోజుల్లో ఏకంగా రూ.8కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

Malla Reddy IT Raids : 2రోజుల్లో రూ.8కోట్లకు పైగా సీజ్.. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అటాక్

Malla Reddy IT Raids : తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా రెండో రోజూ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కంటిన్యూ అయ్యాయి. కాగా, ఈ తనిఖీల్లో రెండు రోజుల్లో భారీగా డబ్బు సీజ్ చేశారు అధికారులు. ఏకంగా రూ.8కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఒక్కరోజూ రూ.4 కోట్లు సీజ్ చేయగా, ఇవాళ మరో రూ.4 కోట్లు సీజ్ చేశారు.

మల్లారెడ్డి పీఏ సంతోష్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెండు రోజుల పాటు తనిఖీలు చేసిన ఐటీ బృందాలు.. సంతోష్ రెడ్డి ఇంటి నుంచి రూ.4కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను సంతోష్ రెడ్డి నివాసంలో స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ రెడ్డి స్టేట్ మెంట్ కూడా నమోదు చేసుకున్నారు.

అటు బాలానగర్ లోని క్రాంతి బ్యాంక్ లో వరుసగా రెండో రోజూ ఐటీ తనిఖీలు కంటిన్యూ అయ్యాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తెను బ్యాంకుకి తీసుకెళ్లారు అధికారులు. బ్యాంకు లాకర్ తెరిచేందుకు ప్రయత్నించినా.. లాకర్ తాళాలు తీసుకుని రాకపోవడంతో బ్యాంకు నుంచి వెనుదిరిగారు ఐటీ ఆఫీసర్లు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఆదాయపన్నుశాఖ తెలిపింది. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల ఈ రాత్రికి ముగియనుండగా, ఇంకొన్ని చోట్ల గురువారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు ఐటీ అధికారులు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్టు గుర్తించినట్టు చెప్పారు. లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడంతో పాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చిస్తున్నట్టు ఆధారాలు సేకరించామన్నారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువకు తక్కువగా చూపించారని అన్నారు. మంత్రి వియ్యంకుడు వర్ధమాన్ కళాశాలలో డైరెక్టర్‌గా ఉండడంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలిపారు.

తన ఆస్తులపై ఐటీ అధికారులు చేస్తున్న దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. అన్ని అనుమతులతోనే ఆసుపత్రులు, కళాశాలలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వాటి ఆస్తుల వివరాలను అధికారులకు అందజేశామని, వారికి సహకరిస్తున్నామని అన్నారు. ఐటీ దాడుల వల్ల తనకు గానీ, తన కుమారులకు గానీ ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. రేపు ఉదయానికల్లా సోదాలు ముగిసే అవకాశం ఉందన్నారు.