తెలుగు రాష్ట్రాలకు నీరందకుండా కర్ణాటక నిర్ణయం

తెలుగు రాష్ట్రాలకు నీరందకుండా కర్ణాటక నిర్ణయం

తెలుగు రాష్ట్రాలకు నీరందించే విషయంలో మరోమారు కుయుక్తులకు సిద్ధం అవుతోంది కర్ణాటక ప్రభుత్వం. దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయం చేసి, దానిద్వారా తమ రాష్ట్రానికి మేలు కలిగేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అయ్యింది కర్ణాటక ప్రభుత్వం. తుంగభద్ర ప్రాజెక్టులోకి వచ్చే ప్రవాహాన్ని తగ్గించే మరో చర్యకు కర్నాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పర్‌భద్ర ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ ఆమోదం కోసం కేంద్ర జలసంఘానికి ప్రతిపాదన . దీనివల్ల తుంగభద్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని నీటిపారుదల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తుంగ నది నుంచి అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయడంతోపాటు, అప్పర్‌భద్ర నుంచి 30 టీఎంసీల వినియోగానికి కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. 5.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడంతోపాటు 367 చెరువులను నింపడానికి 16 వేల 125 కోట్ల అంచనాతో ఈ పథకాన్ని చేపట్టింది. ఆమోదం కోసం కేంద్ర జలసంఘానికి పంపగా, గతేడాది డిసెంబరు 24న జరిగిన సాంకేతిక సలహా కమిటీ సమావేశమై చర్చించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం, ఖర్చు-ప్రయోజనం విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన జలసంఘం… త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా కర్నాటక సర్కార్ కోరుతోంది.

గతంలోనే అప్పర్‌భద్ర ప్రాజెక్టు చేపట్టినప్పటికి… దీని సామర్థ్యం పెంచడం, తుంగ నది నీటిని మళ్లించనుండటంతో తుంగభద్రకు నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ ప్రాజెక్టు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తుంగభద్రకు తుంగ, భద్ర నదుల ద్వారా ప్రవాహం వస్తుంది. ఇందులో తుంగ నుంచి ఎక్కువగా వస్తుంది. తుంగభద్రపై షిమోగా సమీపంలో నాలుగు టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట మాత్రమే ఉంది. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఆనకట్ట స్థానంలో కొత్తది నిర్మించారు. ఇక్కడ పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తే పశ్చిమ కనుమలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఆ ప్రయత్నం చేయలేదు. భద్రలో కర్ణాటకకు 62.5 టీఎంసీల కేటాయింపు ఉంది. ఈ మొత్తం నీరు వినియోగంలో ఉంది. అయితే భద్ర డ్యాం నుంచి అప్పర్‌భద్రకు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా దీని పనులు జరుగుతున్నాయి.

గతేడాదిలో రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున సుమారు 20 టీఎంసీలను ఎత్తిపోసినట్లు తెలుస్తోంది. భద్ర నుంచి ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహం కీలకం. దీని నుంచి అదనంగా నీటి వినియోగానికి ఏ ప్రాజెక్టు చేపట్టినా అది తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చాలా కాలంగా తెలుగు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు తుంగ నుంచి 17.4 టీఎంసీలను భద్ర నదికి ఎత్తిపోసి, భద్ర నుంచి 29.9 టీఎంసీలతో అప్పర్‌భద్ర ఎత్తిపోతల పథకం ప్రతిపాదన కేంద్ర జలసంఘం ముందుంది. దీని ప్రకారం చెరువులను నింపడానికే 10.86 టీఎంసీలు అవసరం. మరో 19 టీఎంసీలతో 5.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడం సాధ్యం కాదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం కావడంతో డ్రిప్‌ ఇరిగేషన్‌ చేపట్టనున్నట్లు ప్రతిపాదించింది.

తుంగ నుంచి ఎంత మళ్లించేది, అప్పర్‌భద్ర నుంచి ఎంత నీటిని వినియోగించుకొనేది పరిశీలించడానికి ఎలాంటి పర్యవేక్షణ లేదు. గతేడాది 20 టీఎంసీలను ఎత్తిపోశారంటే, సవరించిన ప్రతిపాదన ప్రకారం ఎక్కువ నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పర్‌భద్రలో ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయినందున, ఈ సమయంలో తమ ముందుకు ఈ ప్రతిపాదన ఎందుకు తెచ్చారని కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ప్రశ్నించగా, ప్రాజెక్టు స్వరూపం మారిందని, నీటి వినియోగం సహా అన్ని అంశాల్లో మార్పు చోటు చేసుకొందని ప్రాజెక్టు అధికారులు సమాధానమిచ్చారు. దీనిపై సీడబ్ల్యూసీ కొన్ని అభ్యంతరాలు చేసింది. అలాగే తుంగభద్ర ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న దానిపై ఆరా తీసినట్లు సమాచారం.