‘దీక్ష భగ్నం చేసేందుకు, నేతలను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు’

‘దీక్ష భగ్నం చేసేందుకు, నేతలను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు’

Farm Laws: నెలల తరబడి జరుగుతున్న రైతు ఆందోళనను చెడగొట్టేందుకు బాహ్య శక్తులు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ పరేడ్‌ను భగ్నం చేసేందుకు, తమ నేతలను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ రైతులు ఓ పట్టుకుని హరియానా పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తిని శుక్రవారం రాత్రి మీడియాకు ముందు నిలబెట్టారు. రిపబ్లిక్‌ డే రోజు పోలీసు మాదిరిగా లాఠీ పట్టుకుని రైతు సంఘాలు చేపట్టే ర్యాలీలో కనిపించాలంటూ తనకు చెప్పారని యువకుడు మీడియాకు వెల్లడించాడు.

అదే సమయంలో పోలీసులపై కాల్పులు జరిపేందుకు కూడా ప్లాన్ చేసినట్లు వివరించాడు. శనివారం ఆందోళనల్లో పాల్గొంటున్న రైతు సంఘాల నలుగురు నేతలను కాల్చి చంపాలని కూడా అనుకున్నట్లు తెలిపాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు ఆరోపించారు.

ట్రాక్టర్‌ పరేడ్‌కు భగ్నం కలిగించేందుకు కుట్ర జరుగుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని హరియానా పోలీసులు స్పష్టం చేశారు. రైతులు అప్పగించిన వ్యక్తిని సోనిపట్‌కు చెందిన యోగేశ్‌ రావత్‌(21)గా గుర్తించామన్నారు. రైతు వలంటీర్లు తీవ్రంగా కొట్టడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నట్లు తేలిందన్నారు. ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, మారణాయుధాలు కానీ లభ్యం కాలేదని సోనిపట్‌ ఎస్పీ జషన్‌దీప్‌ సింగ్‌ రన్‌ధావా వివరించారు.

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్‌ పరేడ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతులు ఇచ్చినట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఘాజీపూర్, సింఘు, తిక్రిల నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు కన్ఫామ్ కావాల్సి ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 5 మార్గాల ద్వారా రాజధానిలోకి ప్రవేశించే ట్రాక్టర్‌ పరేడ్‌లో సుమారు 2 లక్షల మంది పాల్గొంటారు. ఇందుకోసం 2వేల 500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు రైతులు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను జనవరి 26న పోలీసులు తొలగించనున్నారు.