పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసిన వైద్య సిబ్బంది..ఆస్పత్రిపాలైన 12 మంది చిన్నారులు
Maharashtra : 12 kids administered sanitiser drops instead of polio dose : మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం 12మంది చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. పల్స్పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలకు బదులుగా వైద్య సిబ్బంది హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కప్పికోప్రి గ్రామంలో పోలియో చుక్కలు వేసిన కాసేపటికే 12మంది చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.
చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యావత్మాల్ జిల్లా పరిషత్ సీఈవో శ్రీకృష్ణ పంచాల్ తెలిపారు. వ్యాక్సిన్ వేసిన సమయంలో పీహెచ్సీ వద్ద ఒక వైద్యుడు, అంగన్వాడీ కార్యకర్త, ఆశా వలంటీర్ ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు చెప్పారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేశారు అధికారులు.