గొడవ ఆపేందుకు వెళ్తే కత్తితో పొడిచి చంపారు

  • Published By: bheemraj ,Published On : December 12, 2020 / 04:16 PM IST
గొడవ ఆపేందుకు వెళ్తే కత్తితో పొడిచి చంపారు

Man brutally murdered : ఢిల్లీలో దారుణం జరిగింది. గొడవ ఆపేందుకు వెళ్లిన పాపానికి కత్తితో పొడిచి చంపారు. గొడవ పడుతున్న వారికి సర్దిచెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కత్తితో 22 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో నీరజ్‌ అతని స్నేహితులు ముఖేష్‌, రాకేష్‌ సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు.

కాగా కృష్ణ, రవి అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డుల స్థానంలో ముఖేష్‌, రాకేష్‌ను నియమించారు. దీంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. బుధవారం రాత్రి నీరజ్‌, ముకేష్‌, రాకేష్‌ విధులు ముగించుకుని తమ ఇళ్లకు వెళ్తుండగా మార్గంమధ్యలో కాపుకాసిన కృష్ణ, రవితో పాటు మరో బాలుడు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది.

ఆ ముగ్గురు ముఖేష్‌, రాకేష్‌పై దాడి చేయగా సర్ది చెప్పేందుకు నీరజ్‌ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ముగ్గురు నీరజ్‌ను కత్తితో 22 సార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కృష్ణ, రవిని అరెస్ట్‌ చేశామని, బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.