ఇక వానలే వానలు..తెలంగాణలో రుతుపవనాల ఎంట్రీ

  • Published By: madhu ,Published On : June 12, 2020 / 01:16 AM IST
ఇక వానలే వానలు..తెలంగాణలో రుతుపవనాల ఎంట్రీ

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నెల 1న కేరళ తీరాన్ని తాకిన రుతు పవనాలు.. 10 రోజులు ప్రయాణించి, గురువారం రాష్ట్రానికి చేరాయి. రెండు, మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అల్పపీడనం : – 
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. వాస్తవానికి తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్‌ 8నే ప్రవేశించాలి. కానీ మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే మాత్రం పది రోజులు ముందే ప్రవేశించాయి. 2019లో జూన్‌ 21న, 2018లో జూన్‌ 8న ఇవి తెలంగాణలో ప్రవేశించాయి.

సాధారణం కన్నా ఎక్కువ వానలు : – 
తొలకరి జల్లులు పలకరించిన వెంటనే రుతుపవనాలు కూడా రావడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మరోవైపు ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయని, వచ్చే మూడు నెలలపాటు సాధారణం కన్నా ఎక్కువ వానలు పడతాయని…. వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు సంబంధించి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య దేశవ్యాప్తంగా చాలావరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

భారీ వర్షాలు : – 
నైరుతి రాకతో తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. గురువారం అంతా మేఘావృతమై కనిపించింది. రాత్రిపూట వర్షం కురిసింది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, వరంగల్‌ అర్బన్, జనగాం, యాదాద్రి జిల్లాల్లో 11.5 నుంచి 20.4 సెం.మీల మధ్యలో వర్షపాతం నమోదైంది. ఇక 6 నుంచి 11 సెం.మీల మధ్యలో వర్షం కురిసిన జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా సాధారణ వర్షాలు కురిశాయి. గురువారం వరకు తెలంగాణలో 142 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

మరో రెండు రోజుల పాటు వర్షాలు : – 
రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు బాగానే కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం, శనివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం మాత్రం అక్కడక్కడ భారీ నుండి అతి భారీవర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీవర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. శనివారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

తగ్గిన టెంపరేచర్స్ : – 
వర్షాలు కురుస్తున్నందున తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యధికంగా మంథనిలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయితే… కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాతోపాటు…  8 జిల్లాల్లో 39 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్లగొండలో 34.2, హైదరాబాద్‌లో 28.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే నిజామాబాద్‌లో 8.5, హన్మకొండలో 7.3, మెదక్‌లో 1.9 డిగ్రీలు తక్కువగా నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది

పత్తి, కంది విస్తీర్ణం పెంచాలి : – 
గతేడాది  వానాకాలంలో 3 వారాలు అధికంగా కురిసిన వర్షాలు, సాధారణం కంటే ఎక్కువగా నమోదైన వర్షపాతం.. యాసంగి సీజన్‌లో పంటల సాగుకు చాలా దోహదపడ్డాయి. దాంతో గడిచిన వానాకాలం సీజన్‌కంటే యాసంగిలో వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సుమారు 40 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో 41 లక్షల ఎకరాల పైచిలుకు సాగవుతుందనే అంచనాలున్నాయి. అన్ని పంటలు కలిపి కోటి 25 లక్షల ఎకరాలకు వ్యవసాయ ప్రణాళిక తయారు చేశారు. పత్తి, కంది విస్తీర్ణం పెంచాలని సీఎం కేసీఆర్‌ రైతులకు విజ్ఞప్తి చేశారు.

నియంత్రిత వ్యవసాయం : – 
నియంత్రిత వ్యవసాయం పేరుతో ఈ వానాకాలం సీజన్‌ నుంచి పంటలు సాగుచేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరి, పత్తి, కందితోపాటు జొన్న, చెరకు, పెసర, సోయాబీన్‌, మినుము, ఆముదం, వేరుశనగ తదితర పంటల సాగుకు కూడా ప్రణాళికలు తయారు చేశారు.

ఏపీలో రుతుపవనాలు : – 
వాతావరణం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ సాగు సీజన్‌పై రైతులు భరోసాతో ఉన్నారు. అటు ఏపీలోకీ నైరుతు రుతుపవనాలు ప్రవేశించాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. కోస్తాంధ్రలో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది.

Read: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన