UP Population Law : ఇద్దరికి మించి సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం రాదు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయి.

UP Population Law : ఇద్దరికి మించి సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం రాదు

Up Population Law

UP Population Law : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయి. ఈ నిబంధనను అతిక్రమించిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించనుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలూ ఉండవు. ఇక ఇంట్లో కేవలం నలుగురికే రేషన్ కార్డును పరిమితం చేస్తూ నిబంధనను పొందుపరిచింది ప్రభుత్వం.

ఇద్దరు పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సహకాలను ఇవ్వనుంది. మొత్తం సర్వీస్ లో రెండు అదనపు ఇంక్రిమెంట్లను ఇచ్చేలా ముసాయిదాలో పేర్కొంది. ఇల్లు లేదా స్థలం కొనుగోలులో సబ్సిడీ ఇవ్వనుంది. వాటితో పాటు కరెంట్, నీటి బిల్లుల్లో రాయితీలు, భవిష్యనిధిలో 3 శాతం ఇంక్రిమెంట్ వంటి వాటిని అందించనుంది. ఒక్కరే సంతానం ఉంటే నాలుగు అదనపు ఇంక్రిమెంట్లతో పాటు ఆ సంతానానికి 20 ఏళ్లు వచ్చేదాకా ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామని ఆ ముసాయిదాలో పేర్కొంది. అంతేకాదు ఐఐటీల్లో చాలా సులభంగా ప్రవేశం దక్కనుంది.

సామాన్య జనానికీ ప్రోత్సాహకాలను అందిస్తామని వెల్లడించింది. కరెంట్, నీటి బిల్లులు, ఇంటి పన్ను, గృహ రుణాల్లో రాయితీలు ఇస్తామని పేర్కొంది. ఈ బిల్లు ముసాయిదాను యూపీ న్యాయ కమిషన్ వెబ్ సైట్ లో పెట్టారు. అందులో మార్పులు చేర్పులకు సంబంధించి సలహాలు సూచనలకు జులై 19 వరకు గడువునిచ్చింది. ఒకరి కన్నా ఎక్కువ భార్యలు లేదా భర్తలున్న వారికీ ఈ మినహాయింపులుండవని ముసాయిదాలో పేర్కొంది. 2021-2030కి సంబంధించి జనాభా నియంత్రణ చట్టాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించనుంది.