ఆ పిల్లలకు పోలియో చుక్కలు వద్దు, ఆరోగ్యశాఖ ముఖ్య సూచన

ఆ పిల్లలకు పోలియో చుక్కలు వద్దు, ఆరోగ్యశాఖ ముఖ్య సూచన

pulse Polio Immunisation drive: జనవరి 31 న దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఆరోగ్యశాఖ ముఖ్య సూచన చేసింది. దగ్గు, జలుబు, జ్వరముంటే చిన్నారులకు పోలియో చుక్కలు వేయరాదని ఆరోగ్యశాఖ సూచించింది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించిన చిన్నారులకు చుక్కల మందు వేయరాదంది. ఈ లక్షణాలు తగ్గిన తర్వాత చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించింది.

దేశవ్యాప్తంగా ఈ నెల 31న ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటలకు చుక్కల మందు వేయనున్నారు. ఆదివారం(జనవరి 31,2021) నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

వాస్తవానికి జనవరి 17 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభం కావడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘పల్స్‌ పోలియో’ కార్యక్రమానికి ఆరోగ్యశాఖలు సిద్ధమయ్యాయి. ఆదివారం(జనవరి 31 ) నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఏపీలో 52లక్షల 72వేల 354 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మరో వైపు తెలంగాణలోనూ ‘పల్స్‌ పోలియో’ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ నగరంలో చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 5లక్షల 15వేల 520మంది పిల్లలకు టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు.