టోల్ చార్జీలు.. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

టోల్ చార్జీలు.. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిపోయిన పాయింట్‌ వరకు ప్రయాణించిన వరకే టోల్‌ చార్జీలను ఇందులో చెల్లించవచ్చని అన్నారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టవచ్చన్నారు.

జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్ల కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. దీని వల్ల ప్రతి ఏటా రూ.20 కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ.10 వేల కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని మంత్రి వివరించారు.

టోల్‌ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను సోమవారం(మార్చి 1,2021) మంత్రి ప్రారంభించారు. అదే విధంగా జాతీయ రహదారులకు రేటింగ్‌ వ్యవస్థను విడుదల చేశారు. ఈ ఏడాది(2021) ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌ను దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

టోల్‌ ప్లాజాల దగ్గర జాప్యాన్ని ఒక నిమిషం లోపునకే పరిమితం చేస్తామని మంత్రి చెప్పారు. టోల్‌ ప్లాజాలను ఆన్‌లైన్ లోనే పర్యవేక్షించే వ్యవస్థ ఆదాయపన్ను, జీఎస్‌టీ, ఇతర అధికారులకు ముఖ్యమైన సాధనంగా మారుతుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో రోజుకు 33 కిలోమీటర్లకు చేరుకున్నట్టు మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.11,035 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు.