ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ గైడ్ లైన్స్..అమలు

తెలంగాణలో పరిపాలనకు కేంద్ర బిందువైన బీఆర్కే భవన్లోని సచివాలయంతోపాటు.. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో.. 2020, జూన్ 22వ తేదీ సోమవారం నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. ఇకపై సచివాలయం, సంబంధిత కార్యాలయాల్లో పనిచేసే వారు సడలించిన ఆంక్షలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక గదులు ఉన్న అధికారులకు ఎలాంటి మినహాయింపులు లేవు. వారు విధిగా హాజరు కావాల్సిందే.
ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లాస్ 4 ఉద్యోగులు వారం విడిచి వారం హాజరు కావాలి. క్లరికల్ సిబ్బంది రోజు విడిచి రోజు కార్యాలయానికి రానున్నారు. విధులకు హాజరు కానీ ఉద్యోగులు హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులకు ముందస్తు అనుమతి ఉంటేనే అధికారులను కలిసేందుకు ఛాన్స్ ఉంటుంది. లిఫ్ట్లో ఆపరేటర్తో పాటు గరిష్టంగా ముగ్గురికి కంటే ఎక్కువగా అనుమతి లేదు.
అధికారులు ఎయిర్ కండీషనర్లను ఎట్టి పరిస్థితులలో కూడా వినియోగించరాదనే నిబంధన విధించారు. కార్యాలయ ప్రాంగణంతో పాటు వాహనాలను క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. అత్యవసర సేవలకు కార్యాలయాలకు ఎటువంటి మినహాయింపు ఉండదు. రెండు వారాల పాట ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇక వారం రోజుల వ్యవధిలో 20మందికి పైగా సచివాలయ ఉద్యోగులు కరోనా భారిన పడటంతో.. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
Read: హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు