Nigeria-Twitter: ట్విట్టర్​పై నైజీరియా సస్పెన్షన్ వేటు.. కారణమేంటంటే?

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బ్లాగులు, సైట్లు మీద ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియాతో సహా పలు దేశాలలో ప్రభుత్వాలు ఈ మేరకు సోషల్ మీడియా మీద ఆంక్షలు విధిస్తుండగా..

Nigeria-Twitter: ట్విట్టర్​పై నైజీరియా సస్పెన్షన్ వేటు.. కారణమేంటంటే?

Nigeria Twitter

Nigeria-Twitter: ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బ్లాగులు, సైట్లు మీద ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియాతో సహా పలు దేశాలలో ప్రభుత్వాలు ఈ మేరకు సోషల్ మీడియా మీద ఆంక్షలు విధిస్తుండగా తాజాగా ఆఫ్రికాలోని నైజీరియా సర్కారు మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫార్మ్ ట్విట్టర్​పై సస్పెన్షన్ వేటు విధించింది. ట్విట్టర్​ను సస్పెండ్​ చేసినట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా దేశ అధ్యక్షుడు ట్వీట్​ను తొలగించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వమే ప్రకటించింది.

నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ దేశంలోని వేర్పాటువాద ఉద్యమాన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. దేశంలోని ఆగ్నేయం ప్రాంతంలో నివసించే కొంతమందిని ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు అధ్యక్షుడు బుహారీ ట్వీట్ చేశారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా వివాదాలకు కారణమవుతుండడంతో ట్విట్టర్ ఆ ట్వీట్ ను​ బుధవారం తొలగించింది. బుహారీ పోస్ట్​ను డిలీట్ చేసిన కారణంగా ట్విటర్​ను బ్యాన్ చేస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి లాయి మహమ్మద్ తెలిపారు. అది కూడా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నామని ట్విట్టర్ లోనే పేర్కొనడం మరో వివాదంగా మారింది.

కాగా, ట్విట్టర్ బ్యాన్ పై ఆ దేశంలో వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది. నైజీరియా ట్విట్టర్​​ బ్యాన్ పై ప్రకటన చేసినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి వరకు వినియోగదారులు తమ ఖాతాను ఉపయోగించుకున్నారు. ఇకపై కూడా వీపీఎన్​ ద్వారా ట్విట్టర్ ను వినియోగిస్తామని.. ప్రభుత్వం నిర్ణయంతో తమకు పనిలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. గతంలో కూడా నైజీరియా ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదాలు తలెత్తగా పలుమార్పు ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్ల మీద ట్విట్టర్ నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపణలు చేసింది. అయితే.. ఈసారి ఏకంగా సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.