వావ్..టెక్ బోయ్ : 7 ఏళ్లకే మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ పాసైన 3rd క్లాస్ విద్యార్ధి
Odisha 7 Year Boy Microsoft Technology Examination : ఒడిశాలోని పిల్లాడు వండర్ కిడ్ లిస్టులో చేరాడు. కేవలం ఏడేళ్ల వయస్సులోనే ఏకంగా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ పరీక్షను క్లియర్ చేశాడు. ఏడేళ్ల పిల్లాడంటే ఆటలు..పాటలు..వీడియో గేములు ఆడుకుంటుంటారు. కానీ వెంకట్ రామన్ పట్నాయక్ అనే ఒడిశాకు చెందిన ఏడేళ్ల పిల్లాడు ఏకంగా టెక్నాలజీ గురించి అవలీలగా పరీక్ష రాసేసి పాస్ అయిపోయి బాల మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్లో మొత్తం 160 క్లాసులకు హాజరై ఆయా కోర్సుల్లో పట్టు సాధించిన టెక్ బోయ్ గా చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం చిన్నారులు అన్ని రంగాల్లోనూ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభాపాటవాలు కనబరుస్తున్నారు. ఒకప్పుడు పిల్లలకు టెక్నాలజీ అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచం అందుబాటులో ఉంది. దీంతో చిన్ననాటే టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. వెంకట్ రామన్ పట్నాయక్ కు కూడా చిన్ననాటే టెక్నాలజీ అసోసియేట్ పరీక్షపరీక్ష రాసి అద్భుతం చేసి అందరితోనూ ఔరా.. అనిపించాడు.
ఒడిశాలోని బాలాంగిర్ అనే ప్రాంతానికి చెందిన వెంకట్ రామన్ పట్నాయక్ 3వ తరగతి చదువుతున్నాడు. 2019 మార్చిలో ఓ యాప్ ద్వారా కోడింగ్ పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు చిన్నారి వెంకట్ రామన్. జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్లో మొత్తం 160 క్లాసులకు హాజరై ఆయా కోర్సుల్లో పట్టు సాధించాడు. ఈ క్రమంలో అతను.. ఆ కోర్సులు చేసిన వారికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ నిర్వహించే ఎంటీఏ (మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్) ఎగ్జామ్కు హాజరై పాస్ అయి సర్టిఫికేషన్ను కూడా సాధించాడు.
ఈ సర్టిఫికేషన్ను పొందాలంటే మాటలు కాదు. పెద్దవాళ్లకే తికమక పడిపోతారు. అటువంటిది ఏడేళ్లకే ఆ ఘనత సాధించేశాడు వెంకట్ రామన్. టెక్నాలజీ పరంగా కెరీర్లో ముందుకు సాగాలనేదే తన లక్ష్యమంటున్నాడు ఈ బాలమేధావి.