Covid Infant : వావ్.. కరోనాను జయించిన 25 రోజుల పసికందు
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.
Covid Infant : కరోనా అనగానే కంగారు పడిపోవడం.. ఉన్న సమస్యకు తోడు ఆందోళన చెంది ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇప్పుడు ఎక్కువమంది కరోనా బాధితుల్లో కనిపిస్తోంది. చాలామంది భయంతోనే మృత్యువాత పడుతున్నారు. ఈ సెకండ్ వేవ్ లో యువకులు, మధ్య వయసు వారు కూడా కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే, భయం వీడి మనోధైర్యంతో ఉంటూ.. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ మంచి ఆహారం, మందులు తీసుకుంటే కరోనాను జయించవచ్చని ఎంతోమంది నిరూపించారు. ఎంతోమంది వృద్ధులు కరోనా నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు.
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.
ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా మదనపూర్ రాంపూర్ ప్రాంతానికి చెందిన మహిళ ఇటీవల ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక.. శిశువు తండ్రి, తాతయ్యకు అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ వైరస్ సోకినట్లు తేలింది. 5 రోజుల పసికందుకూ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అంతా కలిసి భవానిపట్నాలో ఉన్న ఐసొలేషన్ కేంద్రంలో చేరారు. అక్కడి నుంచి వీరిని భువనేశ్వర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు 20 రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో వీరు కరోనా నుంచి కోలుకున్నట్లు తేలింది. శిశువును ఐసీయూలో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వైద్యం అందించామని, నెగెటివ్గా తేలడంతో గురువారం(మే 13,2021) డిశ్చార్జి చేశామని డాక్టర్లు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఆమె తాత, తండ్రి ఇంకా చికిత్స పొందుతున్నారు.
”25రోజుల పసికందు పేరు గుడియా. కలహండి జిల్లా. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు, ఆహార లోపంతో బాధపడుతోంది. పలు అవయవాలు పని చెయ్యడం లేదు. పసికందుని ఐసోలేషన్ ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాము. చికిత్సలో భాగంగా రెమిడెసివిర్, స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్ ఇచ్చారు. 10రోజుల పాటు వెంటిలేటర్ పై నే చికిత్స ఇచ్చాము. మూడు వారాల తర్వాత పసికందులో మార్పు కనిపించింది. ఆరోగ్యం మెరుగుపడింది. మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు చేశాము. అప్పుడు ఫలితం నెగిటివ్ వచ్చింది. పసికిందు ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాము” అని డాక్టర్ తెలిపారు.