గల్ఫ్ లో మానవత్వం : కరోనా మృతుడికి అంత్యక్రియలు చేసిన హైదరాబాదీలు
కరోనా రాకాసి..మనుషులనే కాదు..మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. ఈ వ్యాధి సోకిన వారు చనిపోతే..కనీసం దగ్గరకు రావడానికి..అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కానీ తమలో ఇంకా మానవత్వం దాగి ఉందని నిరూపిస్తున్నారు. మేము నిర్వహిస్తాం..అంటూ అంత్యక్రియలు చేస్తున్నారు.
తాజాగా గల్ఫ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. హైదరాబాదీ వాసులు ముందుకొచ్చి చివరి సారి నిర్వహించే కార్యక్రమాలను నిర్వహించడంపై పలువురు అభినందిస్తున్నారు. ఒమన్ దేశంలో జరిగిన ఈ ఘటనను TRS NRI ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
ఒమన్ లో ఓ భారతీయుడికి కరోనా వైరస్ సోకింది. చికిత్స పొందుతూ గత వారం చనిపోయాడు. కానీ కరోనా రాకాసికి భయపడి ఎవరూ అంత్యెక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. ఒమన్లోని ఇండియన్ సోషల్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ నివాసి సోహైల్ఖాన్, క్లబ్ సభ్యులు సంజీత్ కనోజియాకు విషయం తెలిసిందే.
వెంటనే వారు ముందుకొచ్చి…అతని మతం (హిందూ) ఆధారంగా అంత్యక్రియలు చేశారు. ఇండియన్ సోషల్ క్లబ్లోని డెక్కన్ వింగ్కి చెందిన ముగ్గురు హైదరాబాద్ యువకులు జాఫ్రీ, ఒబాయిది, తమిమ్లు ఇందులో పాల్గొన్నారు. వీరిని పలువురు అభినందిస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకున్నారు.