ఆపరేషన్ చిరుత.. మళ్లీ తప్పించుకున్న పులి, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

హైదరాబాద్ శివార్లలో కలకలం రేపిన చిరుత పులి జాడ ఇంకా తెలియరాలేదు. 24 గంటలు గడిచినా దాని ఆచూకీ

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 06:07 AM IST
ఆపరేషన్ చిరుత.. మళ్లీ తప్పించుకున్న పులి, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

హైదరాబాద్ శివార్లలో కలకలం రేపిన చిరుత పులి జాడ ఇంకా తెలియరాలేదు. 24 గంటలు గడిచినా దాని ఆచూకీ

హైదరాబాద్ శివార్లలో కలకలం రేపిన చిరుత పులి జాడ ఇంకా తెలియరాలేదు. 24 గంటలు గడిచినా దాని ఆచూకీ తెలియలేదు. బుద్వేల్ నుంచి చిరుత తప్పించుకుంది. బుద్వేల్ రైల్వే స్టేషన్, కాటేదాన్ ఏరియాల్లో పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. చిరుత రాజేంద్రనగర్ యూనివర్సిటీ వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు. 20 ట్రాప్ కెమెరాలు పరిశీలించారు. 

24గంటలు దాటినా దొరకని చిరుత ఆచూకీ:
శుక్రవారం(మే 15,2020) రెండో రోజు కూడా చిరుత పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు, అటవీశాఖ, జూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులి జాడ కనిపెట్టి దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 24 గంటలు దాటినా పులి జాడ కనిపెట్ట లేకపోయారు అధికారులు. దీంతో డే 2లో ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

రాజేంద్రనగర్ యూనివర్సిటీ వైపు వెళ్లినట్లు సమాచారం:
ఆపరేషన్ చిరుతపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. చిరుత పులి జాడ ఇంకా దొరకలేదన్నారు. బుద్వేల్ రైల్వేస్టేషన్, కాటేదాన్ ప్రాంతాల్లో 20 ట్రాప్ కెమెరాలతో పులి కోసం గాలించినట్టు ఆయన చెప్పారు. చిరుత ఫాంహౌస్ లో లేనట్లు భావిస్తున్నామన్నారు. చిరుత నిన్న(మే 14,2020) వచ్చిన దారి నుంచి మళ్లీ బయటకు వెళ్లినట్లు తమకు సమాచారం ఉందన్నారు. చిరుత పులి రాజేంద్రనగర్ యూనివర్సిటీ వైపు వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. అర్థరాత్రి హిమాయత్ సాగర్ వైపు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని డీసీపీ సూచించారు.

అరణ్యం నుంచి జనారణ్యంలోకి:
గురువారం(మే 14,2020) ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై స్థానికులు చిరుతపులిని గుర్తించారు. ఎన్‌హెచ్‌-7 ప్రధాన రహదారిపై గాయపడిన చిరుత కనిపించింది. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. వెంటనే అటవీశాఖ అధికారులు, జూ పార్క్‌ రెస్క్యూ టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది తప్పించుకుంది. పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయింది. చిరుత ఎడమ కాలికి గాయమైంది. దీంతో అది వేగంగా పరిగెత్తలేకపోతోంది. గాయపడినా దొరక్కుండా అందరికి చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కరోనా మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు.. తాజాగా చిరుత భయం పట్టుకుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

రాత్రంతా కొనసాగిన ఆపరేషన్ చిరుత:
చెట్ల పొదల్లో నక్కిన చిరుతను బయటకు రప్పించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రాత్రంతా ఆపరేషన్ చిరుత కొనసాగింది. అయినా ప్రయోజనం లేదు. చిరుతను పట్టుకునేందుకు మూడు శాఖల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుత నక్కిన ఫామ్ హౌస్ మొత్తం దట్టమైన చెట్లు ఉంటాయి. దీంతో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 25 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత కదలికలపై నిఘా పెట్టారు. అంతేకాదు 10 కుక్కులు, 2 మేకలను ఎరగా వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చిరుతను ఎలాగైనా పట్టుకుని తీరుతామని అధికారులు అంటున్నారు. మొత్తంగా ఆపరేషన్ చిరుత డే 2 కూడా కంటిన్యూ అవుతోంది. కాగా, కాటేదాన్, బుద్వేల్ వాసులు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Read Here>> ఆపరేషన్ చిరుత.. 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ, నేడు ప్లాన్-బి అమలు