ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ పే

ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ పే

phonepe gives shares to employees: వాల్ట్ మార్ట్ కి(Walmart) చెందిన ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(PhonePe).. తన ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఫోన్ పే సంస్థ తన ఉద్యోగులకు షేర్లు(ఎంప్లాయి స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్స్-ESOP) ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షల విలువైన షేర్లను బదలాయించింది. కంపెనీలోని అన్ని స్థాయిల్లో ఉన్న 2వేల 200 మంది ఉద్యోగులకు వర్తించేలా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకోసం రూ.1,500 కోట్లను విలువైన షేర్లను ఉద్యోగుల పరం చేసింది.

2020 డిసెంబర్ లో ఫ్లిప్ కార్ట్ నుంచి విడిపోయి స్వతంత్ర సంస్థగా అవతరించాక, ఫోన్ పే తీసుకున్న భారీ నిర్ణయం ఇది. తాజా షేర్ల బదలాయింపుతో ఉద్యోగులను కూడా యాజమాన్యంలో భాగస్వాములను చేసినట్టయింది. ఈ మేరకు ఫోన్ పే వర్గాలు ప్రకటన చేశాయి. ఉద్యోగులు భవిష్యత్తులో లాభసాటి అనిపించినప్పుడు ఈ షేర్లను అమ్ముకోవచ్చు.

ఫోన్ పే సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ట్విట్టర్ లో స్పందించారు. ఫోన్ పే వ్యవస్థాపకులుగా రాహుల్ చారి, నేను అద్భుతమైన భావోద్వేగాలకు గురవుతున్నాం, సంపదను పంచుకోవడం మమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతోంది అని వెల్లడించారు. ఫోన్ పే సంస్థ నిర్ణయం ఉద్యోగుల్లో సంతోషం నింపింది. వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంలో మునిగి తేలుతున్నారు.