భర్తను హత్య చేసినా..ఆ భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందే: హైకోర్టు సంచలన తీర్పు

భర్తను హత్య చేసినా..ఆ భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందే: హైకోర్టు సంచలన తీర్పు

Punjab, Haryana High court Sensational judgment  : భర్త మరణానంతరం భార్యకు వచ్చే వితంతు పింఛనుపై పంజాబ్, హర్యానా హైకోర్టు పెను సంచలన కలిగించే తీర్పునిచ్చింది. భర్తను భార్య హత్య చేసినా..ఆ భార్యకు భర్త మరణానంతరం వచ్చే వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది. అంతేకాదు ఆమె మరో వివాహం చేసుకున్నా సరే పెన్షన్ ఇవ్వాల్సిందేనని పంజాబ్, హర్యానా అత్యున్నత ధర్మాసనం అయిన హైకోర్టు స్పష్టంచేస్తూ..తేల్చి చెప్పింది. జనవరి 25 న హర్యానాకు చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ అసాధారణ తీర్పునిచ్చింది.

కుటుంబ పెన్షన్ అనేది సంక్షేమ పథకమని..ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకే దానిని ప్రవేశపెట్టారని న్యాయస్థానం ఈ సందర్భంగా తెలిపింది. క్రిమినల్ కేసులో ఆమెకు శిక్ష పడినా సరే ఆ భార్య పెన్షన్ హక్కును కాదనలేమని తీర్పునిచ్చింది.

హర్యానాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ అనే మహిళ భర్త తర్సెమ్‌సింగ్. అతను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. 2008లో ఆయన మరణించాడు. 2009లో అతనిని భార్యే చంపిందని ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలిన ఆమెకు 2011లో శిక్ష కూడా పడింది. అప్పటి వరకు బల్జీత్‌ కౌర్‌కు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం ఆమెకు శిక్ష పడగానే ఆపివేసింది. దీంతో బల్జీత్ కౌర్ కోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయస్థానం..ఆమె భర్తను హత్య చేసినప్పటికీ, పెన్షన్ ఇవ్వాల్సిందేనని తేలుస్తూ..తీర్పునిచ్చింది. భర్త మరణానంతరం భార్యే కుటుంబ పింఛనుకు హక్కుదారు అవుతుందని..కాబట్టి ఆమెకు రావాల్సిన పింఛను..పాత బకాయిలతో సహా మొత్తం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో ఆమెకు అందజేయాలని సంబంధింత శాఖా అధికారులను హైకోర్టు ఆదేశించింది.

కాగా..భర్త మరణించిన తరువాత భార్యకు సిసిఎస్ (పెన్షన్) నిబంధనలు 1972 ప్రకారం కుటుంబ పింఛను లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి యొక్క వితంతువు పునర్వివాహం తర్వాత కూడా కుటుంబ పెన్షన్ పొందటానికి అర్హులు.