చల్లని కబురు : 25, 26 తేదీల్లో నగరంలో వాన కురిసే ఛాన్స్

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 01:27 AM IST
చల్లని కబురు : 25, 26 తేదీల్లో నగరంలో వాన కురిసే ఛాన్స్

ఎండలతో అల్లాడుతున్న నగర వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. 2020, మే 25, 26వ తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. మరోవైపు నగరంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2020, మే 23వ తేదీ శనివారం ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో జనాలు అల్లాడిపోయారు.

ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు గరిష్టంగా 42.8, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు. గాలిలో తేమ 14 శాతంగా నమోదైందన్నారు. తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈరోజు కూడా ఏపీ, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు.

ఉదయం 9 నుంచే వేడెక్కుతున్న వాతావరణం రాత్రి 8గంటల వరకు చల్లబడడం లేదు. శనివారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 2020, మే 23వ తేదీ నెల్లూరు జిల్లా కసుమూరులో 44 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కురిచేడులో 43 డిగ్రీలు, కర్నూలు జిల్లా యనకండ్లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే.. ఎండల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.