Asia Cup 2022: ఆసియా కప్ గెలిచే జట్టేదో చెప్పేసిన రికీ పాంటింగ్.. ఆ విషయంలో డౌటే లేదంట.. ఎందుకంటే?
త్వరలో జరగబోయే ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు పేవరెట్ అని, ఆ రెండు జట్లలోనే ఒకరు టైటిల్ విజేతగా ఉంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.
Asia Cup 2022: త్వరలో జరగబోయే ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు పేవరెట్ అని, ఆ రెండు జట్లలోనే ఒకరు టైటిల్ విజేతగా ఉంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. అయితే అధికశాతం అవకాశాలు ఇండియాకే ఉంటాయని, ఆ రెండు జట్ల మ్యాచ్ జరుగుతున్న క్రమంలో నేను భారత్ వైపు ఉంటానని రికీ పాంటింగ్ అన్నాడు. ఆసియా కప్లో భాగంగా ఆగస్ట్ 28న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా సూపర్ 4లో మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
ఈ రెండు జట్ల బలాబలాలపై రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. గత సంవత్సరం T20 ప్రపంచ కప్ తర్వాత ఆగస్టు 28న మరోసారి రెండు జట్లు తలపడనున్నాయి. బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ జట్టు గత ఏడాది అక్టోబర్లో జరిగిన పోరులో 10 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి, భారత్ పై విజయం సాధించిందని అన్నారు. అయితే గతేడాదితో పోల్చితే.. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా T20 జట్టుకు అనేక బలాలు తోడయ్యాయని అన్నారు. టీమిండియా కూడా స్క్వాడ్ డెప్త్లో గణనీయంగా మెరుగుపడిందని, ఆగస్టు 27 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ను భారత్ గెలవడానికి ఇది సహాయపడుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
కేవలం ఆసియా కప్లోనే కాదు, ఏ టోర్నీలోనైనా భారత్ను దాటవేయడం ఎల్లప్పుడూ కష్టమేనని అన్నారు. ఆసియా కప్లో భారత్ 13 మ్యాచ్ లలో 7-5 ఆధిక్యతతో (ఒక ఫలితం లేదు) కలిగి ఉందని, అయితే ఈ దఫా ఇరు జట్ల మధ్య గట్టి పోటీ జరుగుతుందని స్పష్టంగా చెప్పగలనని పాటింగ్ అన్నాడు. అయితే చివరికి భారత్ విజేతగా నిలుస్తుందని నేను భావిస్తున్నానని తెలిపాడు.