TNGO హౌజింగ్ సొసైటీలో కదులుతున్న అక్రమాల డొంక, రింగ్ లీడర్ ఆ రిటైర్డ్‌ తహసీల్దార్..?

టీఎన్జీవో సోసైటిలో అంతా ఆయ‌న‌దే హ‌వా.. సోసైటికి సెక్రట‌రీగా ఉన్న ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న మాట

  • Published By: naveen ,Published On : June 25, 2020 / 09:25 AM IST
TNGO హౌజింగ్ సొసైటీలో కదులుతున్న అక్రమాల డొంక, రింగ్ లీడర్ ఆ రిటైర్డ్‌ తహసీల్దార్..?

టీఎన్జీవో సోసైటిలో అంతా ఆయ‌న‌దే హ‌వా.. సోసైటికి సెక్రట‌రీగా ఉన్న ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న మాట

టీఎన్జీవో సోసైటిలో అంతా ఆయ‌న‌దే హ‌వా.. సోసైటికి సెక్రట‌రీగా ఉన్న ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న మాట విన‌క‌పోతే.. అక్కడ‌ ప్లాట్ ఉన్నా ఇల్లు క‌ట్టుకోలేరు. అంతేకాదు.. ఆయ‌న‌ను ఎదిరిస్తే.. ఉన్న ఇల్లు కూడా తెల్లారేస‌రికి వేరొకరి పేరుకు మారిపోతుంది. ఇక అత‌నిపై ఫిర్యాదు చేసినా.. ప‌ట్టించుకునే వారే ఉండ‌రు. ఒక్కమాట‌లో చెప్పాలంటే.. ఆ సొసైటీ అక్రమాల‌్లో చ‌క్రం తిప్పే రింగ్ లీడర్ ఆయ‌న‌.‌

హౌసింగ్ సోసైటిలో ఆయ‌న మాటకు తిరుగులేదు:
టీఎన్‌జీవో హౌజింగ్ సొసైటీలో అక్రమాల డొంక కదులుతోంది. వీటన్నింటి వెనుకా ఉన్నది … ప్రస్తుతం టిఎన్జీవో హౌసింగ్ సోసైటిలో కీల‌క భాధ్యుడే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హౌసింగ్ సోసైటిలో ఆయ‌న మాటకు తిరుగులేదు. ఆయ‌న మాట కాదంటే.. ఒక్క పనీ జరగదు. చివరకు ప్లాట్‌ ఉన్నా.. ఇల్లు కట్టుకోలేరు. ఇంటి ముందు ఇటుక ముక్కను కూడా కదల్చలేరు. అంతలా సొసైటీలో చక్రం తిప్పుడున్నాడీ రిటైర్డ్‌ తహసీల్దార్.. 

తొలి ప్లాట్‌ను దక్కించుకున్న చంద్రసేనారెడ్డికి.. సొసైటీలో ప్లాటే లేకుండా పోయింది:
టీఎన్‌జీవో హౌసింగ్‌ సొసైటీ భూమిలోని ఒకటో నెంబర్ ప్లాట్‌లో ఉంది.. ఈ కామధేను స్వీట్స్‌ బిల్డింగ్‌. ఈ సొసైటీలో చక్రం తిప్పుతున్న వ్యక్తిదే ఈ ప్లాట్‌. వాస్తవంగా 180 గజాల స్థలం మాత్రమే ఆయనకు ప్రభుత్వం కేటాయించింది. కానీ.. దానికి రెండింతల స్థలంలో ఈ బిల్డింగ్ వెలసింది. ఈ విషయంలో ఇంకా కూపీలాగితే.. అక్రమాల పరంపర బయటపడింది. ఇళ్ల స్థలాలు కేటాయించినప్పుడు.. ఈ హౌసింగ్ సొసైటీలో తొలి ప్లాట్‌ పట్టాను తహసీల్దార్ చంద్రసేనా రెడ్డికి… అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. కానీ సీన్‌ కట్‌ చేస్తే.. ఆ స్థలం సొసైటీలో చక్రం తిప్పుతున్న వ్యక్తి పరమయ్యింది. తొలి ప్లాట్‌ను దక్కించుకున్న చంద్రసేనారెడ్డికి.. సొసైటీలో ప్లాటే లేకుండా పోయింది. 

ప్లాట్‌ ఉన్నా ఇల్లు కట్టుకోలేరు.. పైగా ఖర్చులంటూ రూ.2లక్షలు వసూలు:
మరో వ్యక్తిది సొసైటిలో 5 నంబ‌ర్ ప్లాట్. రిటైర్డ్ త‌హ‌సీల్దార్ బి. న‌ర్సింగ్ రావు కు 2003లో నాటి ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్లాట్ కూడా సొసైటీలో చక్రం తిప్పుతున్న వ్యక్తి ఇంటి పక్కనే ఉంటుంది. తమ ప్లాట్‌నూ కొట్టేసేందుకు ఆ పెద్దమ‌నిషి వేధిస్తునార‌ని ప్లాట్‌ ఓనర్ వాపోయారు‌. ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమైతే.. ఆ ప్లాటే మీది కాదంటూ అడ్డం పడ్డాడట. చివరకు ఈ విషయంలో అసలు ఓనర్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. పైగా సొసైటీలో ఇతరత్రా ఖర్చులంటూ రెండు లక్షలు కూడా వీళ్ల నుంచి వసూలు చేశారట.. 

ఎవరైనా ఎదిరిస్తే.. తన పవర్‌ ఏంటో చూపిస్తాడట:
ఇప్పుడు సొసైటిలో ఏం జరగాలన్నా ఆయనే నిర్ణయించాలంటున్నారు అక్కడ నివసిస్తున్న ఉద్యోగులు. ఎవరైనా ఎదిరిస్తే.. తన పవర్‌ ఏంటో చూపిస్తాడట.. అలానే బలయ్యానంటున్నాడు రిటైర్డ్ ఉద్యోగి బుచ్చయ్య. ఎనిమిదేళ్ల క్రితం ఆయన ఇళ్లు కట్టుకుని ఉంటున్నా.. ఇప్పుడు ఈ ప్లాట్‌ను ఇంకొకరికి కేటాయిస్తూ నోటీస్ బోర్డులో పెట్టేశాడు.. ఆ పెద్దమనిషి.

ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు:
ప్రభుత్వం లోని నాన్‌ గెజిటెడ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం 2003లో అప్పటి ప్రభుత్వం గచ్చిబౌలిలో 50 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పటి ప్రెసిడెంట్‌ రాజేందర్‌ రెడ్డి, సెక్రటరీ గోపాల్‌లు ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చివరకు 2016లో రాజేందర్‌రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. సెక్రటరీ హోదాలో గోపాల్‌ సొసైటీ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే.. గోపాలే ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్లు అమ్ముకున్నారని.. తన పాత్ర ఏమీ లేదంటూ చెబుతున్నారు మాజీ ప్రెసిడెంట్‌ రాజేందర్‌ రెడ్డి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. 

సొసైటీలో అరాచక శక్తిగా మారిన ఆయన:
సొసైటీలో అరాచక శక్తిగా మారిన ఆయనపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. ఇప్పటికే ఈ సొసైటీలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప.. తమ సమస్యలు తీరవంటున్నారు.