విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య

విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య

rowdy sheeter brutal murder: విశాఖలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి బయట ఫుట్‌పాత్‌పై కూర్చున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆపై కత్తులతో పొడిచి చంపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మద్దిలపాలెం సమీపంలోని కేఆర్ఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ వెంకట్‌రెడ్డి అలియాస్ బండరెడ్డి మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి తన ఇంటి సమీపంలో ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో బైక్‌లపై ఇద్దరు, కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంకటరెడ్డిపై దాడికి దిగారు. తొలుత ఇనుపరాడ్లతో దాడిచేసి ఆపై కత్తులతో పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

వెంకట్ రెడ్డి రౌడీషీటర్ అని, అతనికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెప్పారు. సుపారీ తీసుకుని నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. అతడిపై రెండు హత్య కేసులు ఉన్నాయన్నారు. విభేదాల కారణంగా అతడితోపాటు తిరిగే వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, ఆధిపత్యం కోసమే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.