Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఊరట లభించింది. ఆయనకు పీఎమ్ఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన అరెస్టుకు సరైన కారణాలు లేవని, ఈ అరెస్టు అక్రమమని కోర్టు వ్యాఖ్యానించింది. సంజయ్తోపాటు ఆయన సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు కూడా బెయిల్ లభించింది.
దీంతో బుధవారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు అభిమానులు, ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాత్రా చాల్ ప్లాట్ల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సంజయ్ రౌత్ను గత ఆగష్టులో ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అయితే, తన అరెస్టుకు వ్యతిరేకంగా సంజయ్ రౌత్ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై ఈడీ అక్రమ కేసులు నమోదు చేసిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Minister Gangula ED Raids: మంత్రి గంగుల ఇంట్లో ముగిసిన ఈడీ, ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
సంజయ్ రౌత్ అరెస్టు అక్రమమని, ఉద్దేశ పూర్వకంగానే ఆయనపై కేసులు నమోదు చేసినట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు ఆయనకు బెయిల్ ఇవ్వకూడదన్న ఈడీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. జైలు నుంచి విడుదలైన అనంతరం సంజయ్ మాట్లాడుతూ కోర్టు తనకు న్యాయం చేసిందని, తన జీవితంలో ఏ తప్పు చేయలేదని ఆయన అన్నారు.