Lakhimpur Kheri Violence : లఖిమ్పూర్ ఘటనపై రాహుల్ ని కలిసిన సంజయ్ రౌత్
శివసేన పార్టీ ముఖ్య నాయకుడు మరియు ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
శివసేన పార్టీ ముఖ్య నాయకుడు మరియు ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి ఘటనపై విపక్షాల సంయుక్త కార్యాచరణపై రాహుల్ తో..సంజయ్ రౌత్ చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్ విపక్ష పార్టీల బృందం లఖింపూర్ ఖేరి సందర్శించే విషయం గురించి రాహుల్ తో చర్చించినట్లు తెలిపారు.
ఇక రాహుల్తో భేటీకి ముందు సంజయ్ రౌత్ ఓ ట్వీట్ లో యూపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. విపక్ష నేతలను రైతులను కలవనీయకుండా యూపీ సర్కార్ అడ్డుకుంటోందని సంజయ్ రౌత్ ఆరోపించారు. రైతులను కలిసేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని యూపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. యూపీ ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా సంయుక్త విపక్ష కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడి కారు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా ఆపై జరిగిన అల్లర్లలో మరో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఘటనలో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను యూపీ పోలీసులు గత రెండు రోజులుగా నిర్బంధంలో ఉంచారు.
ప్రియాంక గాంధీ అరెస్టుపై మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ..ఎవరినైతే మీరు అరెస్ట్ చేశారో.. ఆమె దేనికీ భయపడే రకం కాదు. సిసలైన కాంగ్రెస్ వాది. పరాజయాన్ని అంగీకరించదు. సత్యాగ్రహం అగదు అని పేర్కొన్నారు.
అయితే ఘటన జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ పార్టీల నేతలకు అనుమతి లేదని ఏడీజీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే రైతు సంఘాల సభ్యులు మాత్రం జిల్లాలో పర్యటించేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.
ALSO READ రైతులపై దూసుకెళ్లిన కారు వీడియో వైరల్..సీబీఐ దర్యాప్తు చేయించాలని సీజేఐకి లాయర్ల విజ్ణప్తి