Sonu Sood: ఫొటోగ్రాఫర్లకు డ్రింక్స్ సర్వ్ చేసిన సోనూ సూద్.. రాఖీ సావంత్ ‘ఇండియా పీఎం’ కామెంట్స్ గురించి ఏమన్నారంటే..!
తనను కలవడానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లకు తన అపార్ట్మెంట్లో సమ్మర్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ.. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రాఖీ సావంత్ వ్యాఖ్యలపై స్పందించారు..
Sonu Sood: సోనూ సూద్.. గతేడాది లాక్ డౌన్ నుండి ఇప్పటి సెకండ్ వేవ్ వరకు ఈయన చేతికి ఎముకలేదేమో అన్నట్లు సాయం చేస్తూనే ఉన్నారు.. అదీ, ఇదీ అని కాకుండా సోనూ చెయ్యనిదంటూ ఏదీ లేదు.. తనకు తోచినంత ఆ మాటకొస్తే తనస్థాయికి మించి ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఆపదలో ఉన్నవారికి సాయమందిస్తున్నారంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది..
కరోనా వైరస్ సెకండ్ వేవ్తో దేశం అల్లాడిపోతుంటే సోనూ సూద్ మాత్రం బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్తో పాటు అవసరమైన మందులు అందచేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈమధ్య ఒకప్పడు బాలీవుడ్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచిన రాశీ సావంత్, సోనూ సూద్ని ‘నెక్ట్స్ ఇండియా ప్రైమ్ మినిస్టర్’ అంది.. అంతకుముందే కొద్దిరోజుల క్రితం కమెడియన్ వీర్ దాస్ కూడా 2024లో సోనూ సూద్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు..
రీసెంట్గా తనను కలవడానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లకు తన అపార్ట్మెంట్లో సమ్మర్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ.. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రాఖీ సావంత్ వ్యాఖ్యలపై స్పందించారు.. ‘‘నేను సాధారణ వ్యక్తిగా ఉండడానికే ఇష్టపడతా’’ అని రెండో మాట లేకుండా చెప్పేశారు..
అలాగే ఓ ఫొటోగ్రాఫర్.. ఎవరికి ఏ ఆపద వచ్చినా మీవైపే చూస్తున్నారు.. మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.. మరి రాజకీయాల్లో ట్రై చెయ్యొచ్చు కదా అని అడిగారు.. సరదాగా నవ్వుతూ.. (రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ).. ‘‘నా సోదరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి నేనేం చేస్తాను?. అది నా పని కాదు’’ అని తేల్చి చెప్పారు.. ఫొటోగ్రాఫర్లకు సోనూ సూద్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..