కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభ ఆహ్వానం: చిన జీయర్‌ను కలిసిన కేసీఆర్

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 05:53 AM IST
కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభ ఆహ్వానం: చిన జీయర్‌ను కలిసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామిని కలుసుకున్నారు. 2020, మే 29వ తేదీ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామికి పండ్లు అందచేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ను శాలువాతో సత్కరించారు. 

ప్రగతి భవన్ లో కరోనా వైరస్, లాక్ డౌన్, ఆర్థిక వ్యవస్థ, పంటల సాగు, రాష్ట్రావతరణ వేడుకలపై 2020, మే 28వ తేదీ గురువార సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష ముగియగానే..శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఉన్న…చిన జీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడ చిన జీయర్ స్వామిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట…వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్, మై హోం గ్రూప్స్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ తదితరులున్నారు. 

శుక్రవారం ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజ్‌ వద్దకు చేరుకుంటారు.

అక్కడ శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌజ్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జ్‌ కెనాల్ వద్దకు చేరుకుని గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. గోదావరికి గంగమ్మకు పూజలు చేస్తారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామికి కేసీఆర్‌ దంపతులు వీడ్కోలు పలుకుతారు. ఆహ్వానించిన కొద్ది మంది అతిథులకు అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సాగునీరు అందించే కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను పంప్ చేసే అపూర్వ ఘట్టం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్నది. గోదావరి నదిపై మేడిగడ్డ నుంచి వివిధ లిఫ్టుల ద్వారా తరలించే నీరు 618 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లోకి చేరుతుంది. 15 టీఎంసిల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా  వ్యవసాయానికి సాగునీరు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వేలాది ఎకరాలు సాగులోకి వస్తుంది.

 

Read:  చారిత్రక ఘట్టం : 29న కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభం..చండీయాగం, సుదర్శనయాగం